Titan Submarine : టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో బయలుదేరి గల్లంతైన టైటాన్ మిని జలాంతర్గామి కథ విషాదాంతమైంది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు చనిపోయి ఉండవచ్చని సబ్మెరైన్లను నిర్వహిస్తున్న కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాల గురించే తమ ఆలోచనలు ఉన్నాయని పేర్కొంది. ఈ ఘటనకు చింతిస్తున్నామని తెలిపింది. తమ CEO స్టాక్టన్ రష్, షాజాదా దావూద్, అతని కుమారుడు సులేమాన్ దావూద్, హమీష్ హార్డింగ్, పాల్-హెన్రీ నార్జియోలెట్లు ప్రాణాలు కోల్పోయారని ఉంటారని ప్రకటించింది.
అట్లాంటిక్ మహాసముద్రంలో 12 వేల అడుగుల లోతులోని టైటానిక్ షిప్ శకలాలను చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో మినీ జలాంతర్గామి టైటాన్ గత ఆదివారం న్యూఫౌండ్ల్యాండ్ నుంచి బయలుదేరింది. పాకిస్థాన్ బిలియనీర్ షెహజాదా దావూద్ ఆయన కుమారుడు సులేమాన్, యూఏఈలో ఉంటున్న బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ మాజీ నావికా అధికారి పాల్ హెన్రీ, ఈ యాత్ర నిర్వాహకుడు, ఓషన్గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్ ఈ జలాంతర్గామిలో ప్రయాణించారు. అయితే మూడు రోజుల నుంచి వీరి ఆచూకీ తెలయడంలేదు. దీంతో కెనడా, అమెరికా తీర రక్షక దళాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. మరోవైపు వీరు ప్రయాణిస్తున్న టైటాన్లో కేవలం 96 గంటలకు సరిపడా ఆక్సిజన్ నిల్వలే ఉండడంతో క్షణక్షణం ఉత్కంఠగా మారింది.
గురువారం సాయంత్రం రిమోట్ ఆపరేటేడ్ వెహికల్ సహాయంతో టైటానిక్ నౌకకు సమీపంలో కొన్ని శకలాలను గుర్తించినట్లు అమెరికన్ కోస్ట్ గార్డ్ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఆర్వోవీ పంపిన సమాచారాన్ని నిపుణులు విశ్లేషిస్తున్నారని కోస్ట్గార్డ్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఓషన్ గేట్ సంస్థ ఈ ప్రకటన విడుదల చేసి ఉంటుందని భావిస్తున్నారు.