Telangana: కేసీఆర్ 9 ఏళ్ల హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో దశాబ్ది దగా కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. కేజీ టూ పీజీ విద్య నుంచి ఉద్యోగ భృతి వరకు.. ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదంటూ నిరసనలు చేపట్టాయి. కేసీఆర్ చేసింది దశాబ్ది దగా అంటూ ఆరోపిస్తూ రోడ్డెక్కారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బ్రిడ్జీ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. 10 తలలతో కూడిన రావణుడి బొమ్మను తెలంగాణ చౌక్ లో దగ్ధం చేశారు.
ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. హనుమకొండ అశోక జంక్షన్ లో జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వంటవార్పు చేసి నిరసన తెలిపారు. పది తలలతో కూడిన కేసీఆర్ చిత్రపటాన్ని దహనం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దశాబ్ది దగా నిరసనల్లో అంబేద్కర్ చౌక్ వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా పలు చోట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో.. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో మోసపూరిత హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని.. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణ గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి నష్టపరిహారం ఇవ్వకపోయినా.. దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వం కోట్లాది రూపాయల సొమ్మును ఖర్చు చేస్తోందంటూ.. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. 9 ఏళ్ల కాలంలో ఏం చేశారని.. ఉత్సవాలు జరుపుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. కేసీఆర్ చిత్రపటానికి పది తలలు ఏర్పాటు చేసి.. ఒక్కో తలపై ప్రభుత్వ వైఫల్యాలను ప్రదర్శించారు. చివరకు ఆ చిత్రపటాన్ని దహనం చేశారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం కోసమే.. ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.