PM Modi: ఒకప్పుడు సామాన్య కార్యకర్తగా అమెరికాకు వెళ్లారు నరేంద్ర మోదీ. అధ్యక్షుడు అధికార నివాసం వైట్హౌజ్ ముందు నిలుచొని ఫోటోలు దిగారు. ఆ గ్రూప్ ఫోటోలో కిషన్రెడ్డి కూడా ఉంటారు. అదే మోదీ.. ఇప్పుడు అదే వైట్హౌజ్లోకి రారాజుగా అడుగుపెట్టారు. ప్రధాని హోదాలో గతంలోనూ వెళ్లినా.. ఈసారి ఆ దర్పం, అట్టహాసం వేరే లెవెల్.
భారత ప్రధాని మోదీకి.. అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్ దంపతులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. మోదీకి గౌరవ సూచకంగా 19 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి.. గన్ సెల్యూట్ చేశారు. అమెరికా జాతీయ గీతాలాపనలో ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
అమెరికాలో తనకు లభించిన గౌరవం 140 కోట్ల మంది భారతీయులకు, 4 మిలియన్ల ఎన్నారైలకు దక్కిన గౌరవమని చెప్పారు ప్రధాని మోదీ. 3 దశాబ్దాల క్రితం సామాన్యుడిగా అమెరికా పర్యటనకు వచ్చిన విషయం గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు జన నీరాజనాలతో తొలిసారి వైట్హౌస్ ద్వారాలు తెరచుకున్నాయని చెప్పారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు దేశ గౌరవాన్ని పెంపొందిస్తున్నారని ప్రశంసించారు. అమెరికా, భారత్లు ప్రజాస్వామ్య పునాదులపై బలంగా ఉన్నాయన్నారు మోదీ.
బైడెన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండు దేశాల బంధం గొప్పదని అన్నారు. రెండు గొప్ప దేశాలు, ఇద్దరు గొప్ప స్నేహితులు.. 21వ శతాబ్ద గమనాన్ని నిర్వచించగలరని బైడెన్ అభిప్రాయపడ్డారు.