Telangana: తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం.. అమరజ్యోతిని ఆరంభించారు సీఎం కేసీఆర్. స్మారక లోపల నివాళులు అర్పించారు. అమర వీరులకు నివాళిగా.. పోలీసులు 12 తుపాకులతో గన్ సెల్యూట్ చేశారు.
అమరజ్యోతి ప్రారంభోత్సవం సందర్భంగా.. 10 వేల మందితో కొవ్వొత్తుల ప్రదర్శనతో అమరులకు నివాళులు అర్పించారు. పలువురు అమరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ సన్మానించారు.
అమరుల స్మారకం ముందు నిర్వహించిన సభలో.. తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని వివరించారు సీఎం కేసీఆర్. రక్తం బొట్టు చిందకుండా.. ప్రణాళికాబద్ధంగా కొట్లాడామని చెప్పారు. ఎన్ని విమర్శలు, ఛీత్కారాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదని.. ప్రత్యేక రాష్ట్రం సాకారం చేసుకున్నామని చెప్పారు.
అమరుల స్మారక చిహ్నాని అమరజ్యోతిగా నామకరణం చేశారు ముఖ్యమంత్రి. ఇకపై తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఏ దేశ, విదేశీ ప్రతినిధులైనా.. ముందుగా అమరజ్యోతి దగ్గర అంజలి ఘటించాకే వారి అధికార పర్యటన కొనసాగుతుందని ప్రకటించారు సీఎం కేసీఆర్.
కేసీఆర్ ప్రసంగం అనంతరం.. ఆకాశంలో అద్భుతమైన డ్రోన్ ప్రదర్శన ఇచ్చారు. 800 డ్రోన్లు.. నింగిలో రకరకాల రంగులీనుతూ.. తెలంగాణ వైభవాన్ని చాటాయి. డ్రోన్ లైటింగ్తో కాకతీయుల తోరణం, చార్మినార్, బతుకమ్మ, తెలంగాణ ఉద్యమ పిడికిలి, కేసీఆర్ నాయకత్వం, అమరుల స్థూపం, శాంతికపోతం, అసెంబ్లీ భవనం, టీహబ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ నమూనాలను లేజర్ షోతో ప్రదర్శించారు. చివర్లో జోహార్ తెలంగాణ అమరవీరులకు.. నినాదంతో అమరజ్యోతి ప్రతిరూపాన్ని ఆకాశంలో ఘనంగా చాటింది డ్రోన్ లేజర్ షో.