JanaSena party latest updates(AP political news): రాజకీయమంటే ఇదే. చిన్న పాయింట్ను పట్టుకుని పెద్దగా లాగడమే. పవన్ టార్గెట్గా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఎమ్మెల్యే ద్వారంపూడి కాపు ఉద్యమానికి ఎంతో సహకరించారని పొగిడారు. జనసేనాని ద్వారంపూడిని తిట్టడాన్ని తప్పుబట్టారు. అక్కడితో మేటర్ క్లోజ్.
కట్ చేస్తే.. మరో సభలో ఉప్మా కథ చెప్పారు పవన్ కల్యాణ్. వైసీపీ వ్యతిరేకులంతా ఐకమత్యంగా ఉండాలనేది.. లేదంటే మళ్లీ వైసీపీనే గెలుస్తుందనేది ఆ ఉప్మా స్టోరీ సారాంశం. ఇంకేం.. ఈ ఉప్మా పాయింట్ను వెంటనే తమకు అనుకూలంగా.. ముద్రగడకు కౌంటర్గా ఫుల్గా వాడేసుకుంటున్నారు జనసైనికులు.
ద్వారంపూడి కాపు ఉద్యమం కోసం ఏం చేశారని.. ఆనాటి కాపు సభలో ఉప్మా పెట్టించింది ఆయనేనా అంటూ విమర్శించారు. అలాగైతే ద్వారంపూడి పెట్టిన ఉప్మా ఖర్చును తిరిగి ఇచ్చేయాలంటూ.. ముద్రగడ పద్మనాభంకు తనవంతుగా రూ.1000 మనీయాడర్ పంపించారు జనసేన నాయకుడు పంతం నానాజి. ఆ మాత్రం హింట్ ఇస్తే చాలని.. ఇక చెలరేగిపోయారు కాకినాడ జనసైనికులు.
పవన్ ఫ్యాన్స్ పోస్టాఫీసు ముందు క్యూ కట్టారు. ఎందుకంటే.. ముద్రగడకు ఉప్మా డబ్బులు తిరిగి ఇచ్చేసేందుకు. వరుసబెట్టి పద్మనాభంకు తమకు తోచినంత మనీయాడర్ చేశారు. మా డబ్బులన్నీ తీసుకొని.. కాపు ఉద్యమం కోసం ద్వారంపూడి చేసిన ఆర్థిక సాయాన్ని తిరిగిచ్చేయమని ముద్రగడకు సూచించారు.
జనసైనికుల ఈ ఎత్తగడ సూపర్బ్గా వర్కవుట్ అయిందని అంటున్నారు. పవన్.. కాకినాడ ఎమ్మెల్యేను తిట్టడం.. జనసేనానిని తప్పుబడుతూ ముద్రగడ లేఖ రాయడం.. ద్వారంపూడి ఆర్థిక సాయం చేశాడని చెప్పడం.. పవన్ ఉప్మా కథ వినిపించడం.. జనసైనికులు ఉప్మా డబ్బులు మనీయాడర్ చేయడం.. అబ్బో కాకినాడలో రంజుగా సాగుతోంది ఉప్మా పాలిటిక్స్.