PM Modi us visit live updates(Latest breaking news in telugu) : భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. చిప్ల తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ సీఈవో సంజయ్ మెహ్రోత్రా, అప్లైడ్ మెటీరియల్స్ సీఈవో గారీ ఈ డికర్సన్, జనరల్ ఎలక్ట్రిక్ సీఈవో లారెన్స్ కల్ప్తో భేటీ అయ్యారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలని వారిని మోదీ ఆహ్వానించారు.
భారత్లో అపార అవకాశాలున్నాయని మైక్రాన్ సీఈవో సంజయ్ అన్నారు. మెమొరీ, స్టోరేజ్ విభాగంలో మైక్రాన్ గ్లోబల్ లీడర్ గా ఉందని పేర్కొన్నారు. డేటా సెంటర్లు, స్మార్ట్ఫోన్లు, పీసీలకు మెమొరీ పరికరాలను సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కృత్రిమ మేధ సేవలు అందిస్తున్నామని చెప్పారు. భారత్ ప్రధాని మోదీతో భేటీ బాగా జరిగిందన్నారు. దేశం కోసం మోదీ దార్శనికత అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. సెమీకండక్టర్ల తయారీ కోసం మైక్రాన్ టెక్నాలజీస్ను మోదీ ఆహ్వానించారని విదేశాంగశాఖ వెల్లడించింది.
భారత వైమానిక, పునరుత్పాదక ఇంధన రంగాల్లో జనరల్ ఎలక్ట్రిక్ కీలక పాత్ర పోషించాలని మోదీ కోరారు. భారత్లో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అందించాల్సిన సాంకేతిక సహకారంపై ఆ సంస్థ సీఈవో లారెన్స్తో చర్చించారు.
మోదీతో భేటీ వివరాలను అప్లైడ్ మెటీరియల్స్ సీఈవో గారీ ఈ డికర్సన్ వెల్లడించారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. భారత్ లో అద్భుతమైన విజయం సాధించడానికి ఎదురు చూస్తున్నామని తెలిపారు. ప్రాసెస్డ్ టెక్నాలజీ, అత్యాధునిక ప్యాకేజింగ్ సామర్థ్యాలను పెంచేందుకు అప్లైడ్ మెటీరియల్స్ సంస్థ భారత్కు రావాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు. భారత్లోని విద్యాసంస్థలతో కలిసి ఆ కంపెనీ పనిచేసే అంశంపై చర్చించారు.