MP mvv satyanarayana news(Andhra pradesh today news) : కిడ్నాపే అంటారు. అంతలోనే విశాఖ నగరం సురక్షితంగా ఉందటారు. క్రూరంగా హింసించి డబ్బులు వసూలు చేశారంటారు. అదే నోటితో వైజాగ్లో లా అండ్ ఆర్డర్ సమస్య లేదంటారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం రోజుల తరబడి హాట్ టాపిక్గా మారింది. ఏకంగా ఓ అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేసి.. డబ్బులు వసూల్ చేయడం తీవ్ర కలకలం రేపింది. వైజాగ్లో శాంతిభద్రతలు సరిగా లేవని.. పోలీసులంటే భయం లేదని.. అందుకే క్రిమినల్స్ ఇలా రెచ్చిపోతున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పవన్ కల్యాణ్ అయితే.. ఆ కిడ్నాపర్లను ఎన్కౌంటర్ చేసిపడేయాలని కామెంట్ చేయడం మరింత సంచలనంగా మారింది. మరోవైపు, విశాఖ జనసేన కార్పొరేటర్ మరింత కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. అది అసలు కిడ్నాపే కాదని.. సెటిల్మెంట్ అని అన్నారు. సీబీఐతో విచారణ జరిపిస్తే నిజానిజాలు బయటకు వస్తాయన్నారు. అటు, చంద్రబాబు సైతం ఈ ఇష్యూని బాగా రైజ్ చేశారు.
కట్ చేస్తే.. ఎంపీ ఎంవీవీ తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ను కలిశారు. అసలేం జరిగిందో ఆయనకు వివరించి వచ్చారు. విశాఖలో ప్రెస్ మీట్ పెట్టి.. ఘటనపై మరోసారి స్పందించారు. విపక్షాలు అవనసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. విశాఖ నగరం సురక్షితంగా ఉందని.. లా అండ్ ఆర్డర్ సమస్య లేదన్నారు. కిడ్నాప్ వ్యవహారంపై సీబీఐ విచారణకు సిద్ధమన్నారు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ.
పోలీసులు చెప్పేవరకు తన ఫ్యామిలీ మెంబర్స్ కిడ్నాప్ అయిన విషయం తనకు తెలీదని చెప్పారు. కిడ్నాపర్లు క్రూరంగా హింసించి డబ్బులు వసూలు చేశారని అన్నారు. మూడు రోజులు రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేశారని.. పోలీసులు అదుపులోకి తీసుకున్న హేమంత్తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. అతనిపై 13 కేసులు ఉన్నాయని చెప్పారు. ఏ2 రాజేశ్పై 40కిపైగా కేసులు ఉన్నాయన్నారు.
తన కుటుంబ సభ్యులు కిడ్నాప్కు గురై.. చావు వరకు వెళ్లొస్తే.. దాన్ని కూడా రాజకీయం చేస్తారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నాప్ వెనుక కుట్ర ఉందనే ఆరోపణలు దురదృష్టకరమన్నారు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ.