Yoga Day : ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము యోగా ఆసనాలు వేశారు. దేశ ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగా మన నాగరికత సాధించిన గొప్ప విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు. ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప బహుమతుల్లో ఒకటి అని అన్నారు. యోగా శరీరం, మనస్సు మధ్య సమతౌల్యం ఏర్పరుస్తుందని తెలిపారు. మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. అందుకే యోగా రోజూ చేయాలని ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు.
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ భారత ప్రజలకు వీడియో సందేశాన్ని పంపారు. భారతీయులు కొత్తదనాన్ని స్వాగతిస్తారని పేర్కొన్నారు. సాంప్రదాయాలను కాపాడుకోవటంలోనూ గొప్ప స్ఫూర్తిని చూపిస్తారని అన్నారు. మానవ సంబంధాలను మెరుగుపరచి ఐక్యతను పెంపొందించే యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశమని పేర్కొన్నారు. యోగా మనషిలోని అంతర్గత దృష్టిని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. మనమంతా కలిసి ఏక్ భారత్ – శ్రేష్ట్ భారత్ స్ఫూర్తిని ప్రపంచానికి చాటాలని మోదీ పిలుపునిచ్చారు.
ఆర్కటిక్, అంటార్కటిక్ ప్రాంతాల్లోని పరిశోధకులు యోగా దినోత్సవాల్లో పాల్గొంటున్నారని మోదీ తెలిపారు. ఈ ఏడాది యోగా దినోత్సవం చాలా ప్రత్యేకమైనదిగా పేర్కొన్నారు. భారత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వేడుకలు జరుపుకోవడంతో యోగా కీర్తి దశదిశలూ వ్యాప్తి చెందుతోందని మోదీ అన్నారు.