AC Trucks on Indian roads : అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే కాదు.. ఇండియా కూడా తనకు ఉన్న వనరులతో ఆటోమొబైల్ రంగంలో కొత్త మార్పులను తీసుకురావడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. కంపెనీలు చేయాలనుకునే మార్పులకు అండగా రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి ఎప్పుడూ అండగా ఉంటారు. అంతే కాకుండా ఆయన కూడా కొత్త ఐడియాలను సంస్థలకు అందిస్తూ ఉంటారు. తాజాగా ట్రక్కుల విషయంలో ఒక మార్పును గడ్కరి ప్రకటించారు.
ప్రస్తుతం ఇండియన్ రవాణాలో ట్రక్కులు అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. పక్క రాష్ట్రాలకు ఎగుమతి, దిగుమతి వంటి విషయాల్లో ట్రక్కులదే కీలక పాత్ర. అందుకే 2025లోపు ప్రతీ ఇండియన్ ట్రక్కులో డ్రైవర్ కంపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఉండాలని, అంతే కాకుండా అందులో ఏసీ కూడా ఉండాలని నితిన్ గడ్కరి ప్రకటించారు. తను మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఏసీ ట్రక్కులను ప్రవేశపెట్టాలనేది తన కల అని తాజాగా పాల్గొన్న ఒక ఈవెంట్లో బయటపెట్టారు.
ఈరోజుల్లో ట్రక్కుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో మంత్రి అనుకున్నట్టుగా ఏసీ ట్రక్కులు తయారు చేయడం సులభమైన విషయమేనా అని పలువురు విమర్శించడం మొదలుపెట్టారు. కానీ నితిన్ గడ్కరి మాత్రం ఈ విషయంలో తన అధికారిక సమ్మతాన్ని కూడా తెలిపారు. ట్రక్కులు నడిపే డ్రైవర్లు జాగ్రత్తగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడం తమ బాధ్యత అని అన్నారు. అంతే కాకుండా నేషనల్ హైవేల పక్కన పలు సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు.
రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా తగిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని గడ్కరి తెలిపారు. ఇండియాలో ట్రక్కులు అనేవి డ్రైవర్లకు సౌకర్యంగా ఉండే విధంగా తయారు అవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు అమెరికాలో అయితే ట్రక్కులు తయారు చేసే సమయంలో డ్రైవర్ల సేఫ్టీ, సౌకర్యానికే ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. మరి గడ్కరి చెప్పినట్టుగా 2025 వరకు ఏసీ ట్రక్కులు అనేవి ఇండియా రోడ్లపై నడుస్తాయో లేదో చూడాలి.