Lokesh Kanagaraj : కొంతమంది దర్శకులు సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయినప్పుడు వారి కెపాసిటీ ఏంటి అని ఎవరూ అంచనా వేయలేరు. కానీ వారిపై నమ్మకంతో స్టార్ హీరోలు వారికి అవకాశం ఇస్తే.. రిజల్ట్ వేరే లెవల్లో ఉంటుంది. దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ తమిళ యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్. ఒక్కసారిగా కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్స్ పక్కన నిలబడే స్థాయికి దక్కించుకున్న లోకేశ్.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకొని ఫ్యాన్స్ను షాక్కు గురిచేశాడు.
మామూలుగా మల్టీవర్స్ కాన్సెప్ట్స్, సినిమాటిక్ యూనివర్స్.. అనేవి ఇంటర్నేషనల్ సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ మొదటిసారిగా అలాంటి కాన్సెప్ట్ను ఇండియన్ సినిమాకు పరిచయం చేశాడు లోకేశ్ కనకరాజ్. అది కూడా పక్కా కమర్షియల్ గ్యాంగ్స్టర్ డ్రామా స్టోరీలతో లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ను ప్రారంభించి.. యూత్ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. అందుకే లోకేశ్ తీసింది తక్కువ సినిమాలే అయినా తన ఫ్యాన్ బేస్ మాత్రం చాలా ఎక్కువ.
ప్రస్తుతం లోకేశ్.. విజయ్, త్రిషతో కలిసి ‘లియో’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇది మాత్రమే కాదు.. తన భవిష్యత్తులో తెరకెక్కించే చిత్రాలు కూడా పూర్తిగా తన సినిమాటిక్ యూనివర్స్కు సంబంధించినవే అని లోకేశ్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించాడు. ప్రస్తుతం లియో షూటింగ్లో బిజీగా ఉన్న లోకేశ్.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో కూడా తన సినిమాటిక్ యూనివర్స్ కాకుండా వేరే సినిమాలు చేసే ఆలోచన తనకు లేదని, అందుకే త్వరలోనే సినిమాలు తీయడం ఆపేస్తానని స్టేట్మెంట్ ఇచ్చాడు.
‘నాకు నా కెరీర్లో ఇంకా ఎక్కువ సినిమాలు చేసే ఆలోచనలు లేవు. నాకు సినిమాల్లో నా సత్తాను చాటుకోవాలనే కోరిక ఉండేది. నిర్మాతల సాయంతో ఎల్సీయూ (లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్) అనేది సాధ్యమయ్యింది. పదేళ్ల తర్వాత సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాను.’ అని బయటపెట్టాడు లోకేశ్. తను చెప్పిన మాటలు ఒక్కసారిగా ఫ్యాన్స్తో పాటు తమిళ సినీ పరిశ్రమను కూడా షాక్కు గురిచేశాయి. లోకేశ్ అలా చేయడం తమకు ఇష్టం లేదంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.