CM KCR: రైస్ మిల్లుల నిర్వహణలో సంస్కరణలకు శ్రీకారం చుట్టబోతున్నారు కేసీఆర్. ఇకపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైలు మిల్లులు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. వరి ధాన్యాన్ని పలు రకాల ఉత్పత్తులుగా మార్చేందుకు జిల్లాల వారీగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వరి పంటను మార్కెటింగ్ చేయటం ద్వారా రైతులను ధనవంతులను చేయనున్నట్లు తెలిపారు. 2వేల కోట్ల వ్యయంతో చేపట్టే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు.
ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానానికి చేరుకున్న రాష్ట్ర రైతులు.. తమ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లో విక్రయించి లాభాలు ఆర్జించే స్థాయికి తీసుకెళ్తామన్నారు కేసీఆర్. ఈ మేరకు పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో రైస్ మిల్లులు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో వరి ధాన్యం నుంచి తయారు చేసే పలు రకాల ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ మేరకు మార్కెట్ విస్తరించే బాధ్యతను కార్పొరేషన్ నిర్వహిస్తుందన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల కానుకగా రైతుల చెంతకే రైస్ మిల్లులు చేరి, పంటకు మరింత గిరాకీ పెంచేలా పలు నిర్ణయాలు తీసుకోనున్నారు కేసీఆర్.
వరి ధాన్యాన్ని ప్రాసెసింగ్ చేసే జపాన్కు చెందిన రైస్మిల్ కంపెనీ సటేక్ కార్పొరేషన్ ప్రతినిధులతో కేసీఆర్ చర్చలు జరిపారు. 2వేల కోట్లకు పైగా వ్యయంతో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి త్వరలోనే సీఎం శ్రీకారం చుట్టనున్నారు.
ఎన్నికల వేళ కావాలనే హడావుడి చేస్తున్నారంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.