Volkswagen : ఆటోమొబైల్ రంగంలో కార్ల కంపెనీల మధ్య విపరీతంగా పోటీ పెరుగుతోంది. అందుకే ఇష్టం లేకపోయినా కూడా ఆ కంపెనీలు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయాల వల్ల కొంతమంది కస్టమర్లను కోల్పోయినా.. ట్రెండ్ ఫాలో అవుతున్నందుకు మరికొంతమంది కస్టమర్లను తమ ఐడియాలు అట్రాక్ట్ చేస్తాయని కంపెనీలు నమ్ముతున్నాయి. తాజాగా వోక్స్వాగన్ కూడా అలాంటి ఒక నిర్ణయమే తీసుకుంది.
ఈరోజుల్లో ఎలక్ట్రిక్ కార్ల వైపే కస్టమర్లు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. దీంతో ఫ్లూయల్ వెహికిల్స్కు క్రేజ్ తగ్గిపోయింది. అందులోనూ మ్యానువల్ వెహికిల్స్ను పట్టించుకునే వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. అయినా కూడా చాలావరకు కార్ల కంపెనీలు ఇంకా మ్యానువల్ కార్లను తయారు చేస్తున్నాయి. ఎందుకంటే ఆ కార్లను ప్రత్యేకంగా ఇష్టపడేవారు కూడా ఉంటారు. తాజాగా వోక్స్వాగన్ మాత్రం ఇక మ్యానువల్ కార్ల తయారీని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. అది కూడా తన గోల్ఫ్ కార్ విషయంలో ఇలాంటి నిర్ణయానికి రావడం కస్టమర్లకు ఆశ్చర్యం కలిగిస్తోంది.
ప్రస్తుతం వోక్స్వాగన్ గోల్ఫ్ కార్లు రోడ్ల మీద తిరుగుతున్నాయి. కానీ నెక్స్ట్ జెనరేషన్ గోల్ఫ్ కార్లలో మ్యానువల్ అనేది ఉండదని సంస్థ స్వయంగా ప్రకటించింది. ఆటోమొబైల్ రంగంలో వోక్స్వాగన్ గోల్ఫ్కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక ఇలాంటి ఒక కారు కూడా ట్రెండ్కు తగినట్టు మారిపోతున్నందుకు కొందరు కస్టమర్లు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం పాత మోడల్ను మిస్ అవుతామని వాపోతున్నారు.
ఈరోజుల్లో హైటెక్ వెహికిల్స్కు, ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకొని వోక్స్వాగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. మ్యానువల్ కంటే ఆటోమేటిక్ కార్లే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. కానీ మ్యానువల్ అలవాటు అయిన వారు మాత్రం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ బాగుండాలంటే మ్యానువలే కరెక్ట్ అంటారు. కానీ త్వరలోనే మ్యానువల్ వెహికిల్స్ అనేవి పూర్తిగా మార్కెట్లో కనబడకుండా పోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.