Visakhapatnam news today telugu(Latest news in Andhra Pradesh) : విశాఖ జ్ఞానానంద ఆశ్రమంలో జరుగుతున్న దారుణాలు వెలుగులోకి వచ్చాయి. పూర్ణానంద స్వామీజీ తనపై అత్యాచారం చేశారని ఓ అనాథ బాలిక ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆయనను సోమవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. బాధితురాలు చెప్పిన ప్రకారం.. రాజమండ్రికి చెందిన బాలిక చిన్నవయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. ఆ తర్వాత బంధువులు ఐదో తరగతి వరకు చదివించారు. రెండేళ్ల క్రితం విశాఖ కొత్త వెంకోజీపాలెం వద్ద ఉన్న జ్ఞానానంద ఆశ్రమంలో చేర్చారు. ఆ ఆశ్రమాన్ని పూర్ణానంద స్వామీజీ నిర్వహిస్తున్నారు. అక్కడ బాలికకు ఆవుల సంరక్షణ పనులు అప్పగించారు.
స్వామిజీ అర్ధరాత్రి గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేవారని బాధితురాలు తెలిపింది. ఏడాది నుంచి గదిలోనే కాళ్లకు గొలుసు వేసి బంధించారని చెప్పింది. ఎదురుతిరిగితే కొట్టేవారని ఆవేదన వ్యక్తం చేసింది. కొద్దిగా అన్నాన్ని నీటితో కలిపి మాత్రమే పెట్టేవారని అక్కడ జరిగిన దారుణాలను వివరించింది. స్నానం చేయడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు పడ్డాడని పేర్కొంది. ఇలా రెండేళ్లు చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించింది.
ఈ నెల 13న పనిమనిషి సాయం చేయడంతో బాధిత బాలిక ఆశ్రమం నుంచి బయటకు వచ్చింది. తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కి ఓ ప్రయాణికురాలికి జరిగిన దారుణాలను తెలిపింది. ఆ మహిళ బాధిత బాలికను 2 రోజుల క్రితం కృష్ణా జిల్లా కంకిపాడులోని హాస్టల్లో చేర్చేందుకు ప్రయత్నించింది. పోలీసుస్టేషన్ నుంచి లేఖ తెస్తేనే చేర్చుకుంటామని హాస్టల్ నిర్వాహకులు చెప్పారు. దీంతో కంకిపాడు పోలీస్ స్టేషన్ వెళ్లి లేఖను తీసుకున్నారు.
ఆ తర్వాత బాలల సంక్షేమ కమిటీకి బాలికను తీసుకెళ్లారు. ఆశ్రమంలో జరిగిన దారుణాలను బాలిక వివరించింది. ఆ తర్వాత బాలికను సీడబ్ల్యూసీ సభ్యులు విజయవాడలోని దిశ పోలీసుస్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ పూర్ణానంద స్వామీజీపై పోక్సో కేసు నమోదైంది.ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం ఆ బాలికను విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.
ఆశ్రమ భూములు కొట్టేయాలని కొందరు చూస్తున్నారని స్వామిజీ ఆరోపిస్తున్నారు. ఆ కుట్రలో భాగంగానే తనపై ఆరోపణలు చేయించారని అంటున్నారు. ఈ కేసులో న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. తమ ఆశ్రమంలో ఉండే ఓ బాలిక అదృశ్యమైందని ఈ నెల 15న ఫిర్యాదు చేశామన్నారు.