Rakesh Master : తెలుగు చలన చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా డ్యాన్స్ మాస్టర్ రాకేశ్ మాస్టర్ ప్రాణాలు కోల్పోయారు. తిరుపతిలో జన్మించిన ఆయన అసలు పేరు ఎస్.రామారావు. 10 ఏళ్ల వయస్సులో డిస్కో డాన్స్ చూసి డ్యాన్సర్గా మారాలని కలలు కన్నారు. టీవీలో వచ్చే సాంగ్స్ ను చూసి డ్యాన్స్ నేర్చుకున్నారు. ఆ తర్వాత తిరుపతి ఓ నృత్య పాఠశాలను ప్రారంభించారు. కేవలం రూ.5 ఫీజుతో డ్యాన్స్లో ఎంతోమందికి శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం చెన్నై వెళ్లారు. ఛాన్స్లు రాకపోవడంతో మళ్లీ తిరుపతికి వచ్చి డ్యాన్స్ స్కూల్ ను కొనసాగించారు.
ముక్కు రాజు మాస్టర్ దగ్గర కొంతకాలం రాకేశ్ మాస్టర్ పనిచేశారు. ఆట, ఢీ డ్యాన్స్ రియాలిటీ షోల ద్వారా డ్యాన్స్ మాస్టర్గా కెరీర్ను మొదలు పెట్టారు. ఆ సమయంలో ఢీ షోకు జడ్జిగా వ్యవహరించిన ప్రభుదేవాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు తెలిసిన వాళ్లే జడ్జిలుగా ఉండాలని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్ తో రాకేశ్ మాస్టర్ బాాగా పాపులర్ అయ్యారు.
వేణు హీరోగా నటించిన చిరునవ్వుతో మూవీలోని ‘నిన్నలా మొన్నలా లేదురా..’ పాటతో కొరియోగ్రాఫర్గా తొలి అవకాశం దక్కింది. ఆ తర్వాత లాహిరి లాహిరి లాహిరిలో దేవదాసు, సీతారామరాజు, యువరాజు, గర్ల్ ఫ్రెండ్, బడ్జెట్ పద్మనాభం, మనసిచ్చాను, సీతయ్య లాంటి సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. అలా 1500 చిత్రాలకుపైగా కొరియోగ్రఫీ చేశారు. గ్లోబల్ పీస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ను అందుకున్నారు. ప్రభాస్ సహా చాలమంది హీరోలకు డ్యాన్స్లో శిక్షణ ఇచ్చారు.
టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ రాకేశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఆయన శిష్యులే . కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారు. పలువురు సెలబ్రిటీలపై వివాదాస్పద కామెంట్స్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి.
ఇన్నాళ్లు రాకేశ్ మాస్టర్ హైదరాబాద్ అబ్దుల్లాపూర్మెట్లోని ఓ అనాథ ఆశ్రమంలో ఉంటూ వచ్చారు. ఆయనకు భార్య లక్ష్మి, కుమారుడు చరణ్తేజ్, కుమార్తె శ్రీజ ఉన్నారు. తన అవయవాలను దానం చేయాలని రాకేశ్ మాస్టర్ భావించారు. ఈ విషయాన్ని ఆయన అసిస్టెంట్ సాజిద్ తెలిపాడు. రాకేశ్ మాస్టర్ కళ్లను దానం చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులు అంగీకరించారు.