Supreme Court : వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణ వచ్చే జులై 3కు వాయిదా వేసింది. తదుపరి విచారణ కోసం సీజేఐ బెంచ్ ముందు లిస్ట్ చేయాలని ఆదేశించింది.
సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. గత వాదనల సమయంలో సీబీఐకు నోటీసులు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. తాజాగా మాత్రం ప్రతివాదులు సీబీఐ, ఎంపీ అవినాష్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది.
వివేకా హత్య కేసు దర్యాప్తును జూన్ 30 లోపు పూర్తి చేయాలని సీబీఐకు సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. సునీతారెడ్డి తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. గడువులోగానే చార్జిషీట్ దాఖలు చేస్తామని సీబీఐ గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఒకవేళ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేస్తే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కు కాలం చెల్లే అవకాశం ఉందని అంటున్నారు.
వివేకా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి మే 31న తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది .ఈ బెయిల్ ను సవాల్ చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. గత విచారణ సమయంలో తానే స్వయంగా వాదనలు వినిపించారు. కానీ సాంకేతిక అంశాలున్న నేపథ్యంలో అడ్వొకేట్ ను పెట్టుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ లుథ్రా ఆమె తరఫున తాజాగా వాదనలు వినిపించారు.