Football : భారత ఫుట్బాల్ జట్టు చరిత్ర సృష్టించింది. నాలుగు దేశాల ఇంటర్కాంటినెంటల్ కప్ రెండోసారి సాధించింది. భువనేశ్వర్లోని కలింగ స్టేడియంలో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో లెబనాన్పై 2-0తో గెలుపొందింది.
స్టార్ ఆటగాడు సునీల్ ఛైత్రీ 46వ నిమిషంలో జట్టుకు తొలి గోల్ అందించాడు. ఇది అతడికి 87వ ఇంటర్నేషనల్ గోల్. 66వ నిమిషంలో ఛాంగ్టే రెండో గోల్ సాధించాడు. చివరి వరుకు ఇదే ఆధిక్యం కొనసాగడంతో భారత ఆటగాళ్లు గెలుపు సంబురాలు చేసుకున్నారు.
ఇంటర్ కాంటినెంటల్ కప్ ఆరంభ సీజన్ 2018లో భారత జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో కెన్యాను 2-0తో చిత్తుగా ఓడించింది. అయితే 2019లో మాత్రం 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే కసితో భారత ఆటగాళ్లు పట్టుదలతో ఆడారు. అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య 4 దేశాల మధ్య ఈ టోర్నీని నిర్వహించింది. ఇందులో భారత్, లెబనాన్, మంగోలియా, వనౌతు దేశాలు పాల్గొంటున్నాయి.