Telangana today news(Telugu news updates): తెలంగాణలో బీసీ కులవృత్తుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థికసాయాన్ని ప్రభుత్వం ప్రకటించగానే భారీగా స్పందన వచ్చింది. మీసేవ కేంద్రాలకు జనం క్యూ కట్టారు. అయితే ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ ఆలస్యమవుతోంది. దీంతో దరఖాస్తుదారులకు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బీసీ కులవృత్తుల వారు కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. ఈ పథకానికి ఈనెల 20తో దరఖాస్తు గడువు ముగియనుంది. దీంతో ఇంకా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయని వారు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే రూ.లక్ష ఆర్థికసాయం పథకానికి 3 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారు. ఎంబీసీలతోపాటు 14 కులాలు ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాలి. ఈ పత్రాలను వెంటనే మంజూరు చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు మంత్రివర్గ ఉపసంఘం సూచించింది.
కానీ క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ సరిగా సాగడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే 2021 ఏప్రిల్ 1 నుంచి జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసిన వారం రోజుల్లోగా ధ్రువీకరణ జారీ చేయాలని పైఅధికారులు ఆదేశించారు. కానీ మండల కార్యాలయాల్లో జాప్యం జరుగుతోంది.
మీసేవ, ఆన్లైన్ కేంద్రాలు కులవృత్తుల కుటుంబాల నుంచి దరఖాస్తు ఫీజును రూ.200 వరకు వసూలు చేస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి. స్మార్ట్ఫోన్ నుంచి దరఖాస్తు చేసేలా ఏర్పాట్లు చేశారు. కానీ అవగాహన లేకపోవడంతో దరఖాస్తు దారులు ఆన్లైన్ కేంద్రాలకే వెళుతున్నారు. కొన్ని మీసేవా కేంద్రాల్లో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు వేగంగా ఇప్పిస్తామంటూ రూ. వెయ్యి వరకు తీసుకున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రూ.లక్ష ఆర్థికసాయం దరఖాస్తు గడువు పొడిగించాలని బీసీ కులవృత్తుల కుటుంబాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. గడువును జూన్ నెలాఖరు వరకు పొడిగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్కు లేఖ రాశారు.