Avinash Reddy : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీత ఈ పిటిషన్ దాఖలు చేశారు. మే 31న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.
ఈనెల 13న ఈ కేసు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. సీనియర్ న్యాయవాదులకు వాదించే అవకాశం ఇవ్వకపోవడంతో పిటిషనర్ సునీతే స్వయంగా వాదనలు వినిపించారు. అవినాష్రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరారు. దర్యాప్తు గడువును జూన్ 30 నుంచి మరికొంత కాలం పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.
సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్న ఈ కేసులో సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతూ ఆ ధర్మాసనం విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. అందుకే సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్లతో కూడిన వేసవి సెలవుల ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టనుంది.
మరోవైపు ఎంపీ అవినాష్రెడ్డి ఆదివారం కూడా సీబీఐ కార్యాలయానికి వచ్చారు. అరగంటపాటు అక్కడే ఉన్నారు. అవినాష్రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సమయంలో తెలంగాణ హైకోర్టు కొన్ని షరతులు విధించింది. దర్యాప్తు సంస్థకు సహకరించాలని స్పష్టం చేసింది. ప్రతి శనివారం సీబీఐ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించింది. దీంతో శనివారం సీబీఐ కార్యాలయానికి అవినాష్ రెడ్డి వచ్చారు. సీబీఐ అధికారులు కొన్ని పత్రాలు అడగడంతో ఆదివారం కూడా మరోసారి సీబీఐ కార్యాలయానికి వచ్చారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ నెలకొంది.