Weather Report: ఈ దేశానికి ఏమైంది.. ఓ వైపు మండే ఎండలు, వేడి గాలులు.. మరో వైపు పలు రాష్ట్రాల్లో వరదలు. ఓ పక్క సూరీడు దంచి కొడుతుంటే.. మరో వైపు వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎండల ధాటికి ప్రజలు బయటికి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. రోజువారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు రికార్డులు బద్ధలు కొడుతున్నాయి. ఇక వర్షాలు సైతం ఓ రేంజ్లో ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
గుజరాత్లో అల్లకల్లోలం సృష్టించిన బిపర్జోయ్ తుఫాన్ ప్రభావం నుంచి ఇంకా తేరుకోనేలేదు జనాలు. రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ ధాటికి జనజీవనం అస్తవ్యస్థమైంది. రహదారులు, చెట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వందల గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వేల సంఖ్యలో ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. గుజరాత్లో మొదలైన తుఫాన్ రాజస్థాన్ మీదుగా ప్రయాణించింది. అక్కడ కూడా ప్రజలు తుఫాన్ ధాటికి జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.
ఇక బీహార్లో వేడిగాలులకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేడి గాలుల కారణంగా ఇప్పటివరకు 25 మంది మరణించారు. అర్రాలోని సదర్ ప్రభుత్వ ఆస్పత్రిలో హీట్ స్ట్రోక్ కారణంగా అనేక మంది రోగులు చికిత్స పొందుతున్నారు.
అటు సిక్కింలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. పలు చోట్ల వంతెనలు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రవాణా నిలిచిపోయింది. రాష్ట్ర పర్యటనకు వెళ్లిన వేల సంఖ్యలో పర్యాటకులు వరదల్లో చిక్కుకున్నారు. సకాలంలో స్పందించిన ఆర్మీ అధికారులు వారిని రక్షించారు.
ఇటు ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలకు జనాలు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన ఉక్కపోత, వేడిగాలుల ధాటికి ఇంటి నుంచి ప్రజలు బయటికి అడుగుపెట్టలేని పరిస్థితి. ఏపీలో వడగాలుల కారణంగా జనాలు. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే దేశంలోకి ప్రవేశించాయని చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. కానీ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించలేదు.
ఎండల ప్రభావంతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్త చెప్పింది వాతావరణశాఖ. రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వడగాలులు సైతం వీచే ఛాన్స్ ఉన్నట్లు స్పష్టం చేసింది.