Political news in telangana(Telugu news live today): తెలంగాణలో గమ్మత్తైన రాజకీయం నడుస్తోంది. పార్టీలన్నీ కలిసి ఓటర్లను ఫుల్ కన్ఫ్యూజ్ చేసి పారేస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ అంటుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని బీజేపీ విమర్శిస్తుంది. ఇంతకీ ఎవరు ఎవరితో జట్టు కట్టారో ఓటర్లకు మాత్రం అంతుచిక్కదు. ఇలా మైండ్ గేమ్ పాలిటిక్స్లో విపక్ష పార్టీలు అధికార బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తున్నాయి.
లేటెస్ట్గా బండి సంజయ్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. కాంగ్రెస్లో 30 సీట్లను నిర్ణయించేది కేసీఆరేనంటూ సంచలన ఆరోపణ చేశారు. వాళ్లు ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది కూడా గులాబీ బాసే డిసైడ్ చేస్తారన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచినా.. ఆ 30 మంది మళ్లీ బీఆర్ఎస్లో చేరుతారంటూ కలకలం రేపారు బండి సంజయ్. కరీంనగర్ మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా ‘టిఫిన్ బైటక్’లో కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు.
ఓవైపు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. కేసీఆర్ను గద్దెదించి.. చర్లపల్లి జైలుకు తరలించి.. అక్కడే కల్వకుంట్ల కుటుంబానికి ఓ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. తన ఆస్తులన్నీ అమ్మైనా సరే.. ప్రాణం పెట్టి పోరాడుతానని సవాల్ చేశారు. గులాబీ బాస్ను ప్రగతి భవన్ నుంచి పంపించేందుకు.. సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని బీజేపీ ఆరోపించడం ఓ స్ట్రాటజీనా? హస్తం పార్టీలో 30 మంది ఎమ్మెల్యేలకు కేసీఆరే టికెట్లు ఇస్తారని చెబుతూ.. బండి సంజయ్ పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని అంటున్నారు.
బీఆర్ఎస్, బీజేపీ మిలాకత్ అంటూ రేవంత్రెడ్డి చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకే కమలదళం ఇలా బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారని మండిపడుతున్నారు. బీజేపీ నేత కొండా సైతం.. కవిత అరెస్ట్ కాకపోవడంతో బీఆర్ఎస్, బీజేపీ దొందుదొందేననే మెసేజ్ వెళ్తోందని సొంతపార్టీ తీరునే తప్పుబట్టారు. ప్రజల్లోనూ ఆ రెండు పార్టీల తీరుపై అనుమానాలున్నాయి. అందుకే, బండి సంజయ్ అలర్ట్ అయి.. కాంగ్రెస్లో 30 మందికి టికెట్లు ఇచ్చేది కేసీఆరే అంటూ కావాలనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని హస్తం నేతలు ఫైర్ అవుతున్నారు.
మరోవైపు, కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబడుతున్న ధరణికి.. బీజేపీ మాత్రం మద్దతు పలుకుతోంది. అధికారంలోకి వచ్చాక ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని రేవంత్రెడ్డి అంటుంటే.. బీజేపీ గెలిస్తే ధరణిని కొనసాగిస్తామని, కాకపోతే పోర్టల్లో సమస్యలు పరిష్కరించి మార్పులు చేస్తామని చెబుతుండటం ఆసక్తికరం. ఇలా కావాలనే కాంగ్రెస్ విమర్శలనే కార్నర్ చేస్తూ.. బీజీపీ వ్యూహాత్మకంగా విమర్శలు చేస్తోందని చెబుతున్నారు. కర్నాటక ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు పెరగడంతో.. ఆ పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకే బీజేపీ ఇలా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ చేస్తోందని హస్తం నేతలు మండిపడుతున్నారు.