Revanth Reddy : బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైనా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. దశాబ్ది ఉత్సవాలు కాదు.. దశాబ్ది దగా అని అన్నారు. ప్రభుత్వ 10 వైఫల్యాలపై పోరాటం చేస్తామని కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 22న 119 నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు చేపడతామని తెలిపారు. ఆర్డీవో, ఎమ్మార్వోలకు వినతి పత్రాలు ఇస్తామన్నారు. ర్యాలీల్లో దిష్టిబొమ్మలు తగలబెడతామని చెప్పారు.
అమరవీరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ నట్టేట ముంచారని రేవంత్ మండిపడ్డారు. 1569 మంది గుర్తించి వారికిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 10ఏళ్లైనా ఇంకా 600 మందిని కూడా గుర్తించలేదన్నారు. హైదరాబాద్ రెండో రాజధాని అంశంపై మేధావులతో చర్చించాలన్నారు.
సినీదర్శకుడు నర్సింగరావుకు ప్రభుత్వ పెద్దలు సమయం ఇవ్వకపోవడం దారుణమని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరారు.
బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని స్పష్టం చేశారు. కేసీఆర్ ను సీఎంగా కొనసాగించాలని బండి సంజయ్ చూస్తున్నారని ఆరోపించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర ఖమ్మంలో ముగుస్తుందన్నారు. ముగింపు సభను ఖమ్మంలోనే నిర్వహిస్తామని రేవంత్ తెలిపారు తెలిపారు.