Smart Wheelchair : ఈరోజుల్లో కొత్త విషయాలను కనుక్కోవడానికి, కొత్త పరికరాలను కనిపెట్టడానికి చాలా అనుభవం ఉండాల్సిన పని లేదు. యూట్యూబ్లో కార్టూన్స్ చూసే పిల్లలు మాత్రమే కాదు.. సైన్స్ క్లాసులు చూసి.. దాని ద్వారా ఎంతోకొంత నేర్చుకునే వారు కూడా ఉంటారు. వయసులో చిన్న అయినా కూడా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలామంది పిల్లలు ఎన్నో అద్భుతాలు సృష్టించారు. తాజాగా ఆ లిస్ట్లో లుథియానాకు పదేళ్ల దివ్యం జైన్ కూడా చేరాడు.
రెండేళ్ల క్రితం యాక్సిడెంట్కు గురయినందు వల్ల దివ్యం జైన్ తాత భూషణ్ జైన్.. వీల్చైర్కే పరిమితం అయ్యారు. అయితే ఆ వీల్ చైర్ సాయంతో ఎక్కడికైనా వెళ్లాలన్నా కూడా పక్కన ఎవరో ఒకరు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా దివ్యం పక్కనుండి చూశాడు. అందుకే తాతకు సాయంగా ఉండడానికి ఒక సెమీ సెల్ఫ్ నావిగేటింగ్ వీల్చైర్ను తయారు చేశాడు. తను చేసిన ఈ ప్రయోగానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా చోటు దక్కింది.
అతి తక్కువ ఖర్చుతో, తనకు అందుబాటులో ఉన్న వస్తువులతో ఈ వీల్చైర్ను తయారు చేశాడు దివ్యం జైన్. దీని గురించి మాట్లాడుతూ.. తాత యాక్సిడెంట్ అయిన తర్వాత పూర్తిగా నడవలేని స్థితికి వెళ్లిపోయాడని అన్నాడు. ఎక్కడికి వెళ్లాలన్నా అటెండెంట్ మీద ఆధారపడాల్సి వచ్చేది. అందుకే ఆయనకు సాయంగా ఉండడం కోసం ఒక పాత వీల్చైర్ను తీసుకొని దానికి మెకానైజ్డ్ సిస్టమ్ను యాడ్ చేసి మొబైల్ ఫోన్తో ఆపరేట్ చేయగలిగే టెక్నాలజీని దానికి అటాక్ చేశాను అని చెప్తున్నాడు.
మామూలుగా స్మార్ట్ వీల్చైర్స్లో కొన్ని లోపాలు కూడా ఉంటాయి. కానీ అవేవి లేకుండా ఈ ఛైర్ను డిజైన్ చేశానని అంటున్నాడు దివ్యం. ఈ స్మార్ట్ వీల్చైర్ అనేది సెమీ సెల్ఫ్ నేవిగేటింగ్ టెక్నాలజీతో తయారు చేశానని చెప్తున్నాడు. ఇందులో అల్ట్రాసోనిక్ సెన్సార్లతో పాటు కంట్రోల్ చేయడానికి టచ్ప్యాడ్, కమాండ్స్ను బట్టి కదిలే నేవిగేషన్ సిస్టమ్ ఉందన్నాడు. ఈ స్మార్ట్ వీల్చైర్కు రెండు ఈ బైక్ మోటర్లు కూడా అటాచ్ చేసుంటాయి. ఇక చుట్టు పక్కన పరిసరాలను చూపించడానికి రూ.10 వేలు విలువ చేసే లీసీడీ స్క్రీన్ కూడా ఉంటుంది. ఇంత చిన్న వయసులోనే ఇలాంటి ఒక ప్రయోగం చేసి అందరి దృష్టిని ఆకర్షించినందుకు దివ్యం జైన్ తల్లిదండ్రులు సంతోషంలో మునిగిపోయారు.