Keerthy Suresh and Suhas : లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఈ మధ్య విపరీతంగా క్రేజ్ పెరిగిపోతోంది. హీరోయిన్లు యాక్షన్ చేస్తే చూడడానికి ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. పైగా అలాంటి కొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు బ్లాక్బస్టర్ హిట్ అవ్వడంతో మరికొన్ని చిత్రాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. అంతే కాకుండా ఒక హీరోయిన్ అలాంటి సినిమాలో నటించి హిట్ అందుకుంటే.. అలాంటి మరికొన్ని కథలు తనను వెతుక్కుంటూ వస్తున్నాయి. అలాంటి వారిలో ఒకరు కీర్తి సురేశ్.
మలయాళ భామ అయినా కూడా మొదటి తెలుగు సినిమాతోనే తన నటనతో అందరినీ ఆకట్టుకుంది కీర్తి. ఆపై కెరీర్ మొదట్లోనే ‘మహానటి’ చిత్రంలో నటించే అవకాశం తనను వరించడంతో కీర్తికి ఎనలేని క్రేజ్ దక్కింది. ఈ సినిమా అలనాటి నటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. సావిత్రి పాత్రలో కీర్తి ఒదిగిపోయింది అని, ఇప్పటినుండి సావిత్రిని గుర్తుచేసుకున్న ప్రతీసారి కీర్తి గుర్తుకువస్తుందని ప్రేక్షకుల చేత ప్రశంసలు దక్కించుకుంది. దీంతో మహానటి తర్వాత లేడీ ఓరియెంట్ స్క్రిప్ట్స్ తనను వెతుక్కుంటూ వచ్చాయి.
మహానటి తెచ్చిపెట్టిన క్రేజ్తో కీర్తి మరికొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ఆఫర్లను అందుకున్నా కూడా అందులో ఒకటి కూడా మినిమమ్ హిట్ అవ్వలేదు. దీంతో మళ్లీ కమర్షియల్ సినిమాల వైపు తన అడుగులు పడ్డాయి. మహేశ్తో చేసిన ‘సర్కారు వారి పాట’.. కీర్తిని మళ్లీ రేసులో నిలబెట్టింది. ఇక తాజాగా విడుదలయిన ‘దసరా’తో కీర్తిలోని మహానటి మరోసారి బయటికి వచ్చింది. ఇప్పుడు కీర్తి చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉండగా.. మరోసారి ఒక లేడీ ఓరియెంటెడ్ కథను కీర్తి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ఒక కొత్త లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ ఎవరో వివరాలు ఇంకా బయటికి రాలేదు. అయితే ఈ చిత్రంలో లేటెస్ట్ సెన్సేషన్ సుహాస్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు రూమర్స్ వైరల్ అయ్యాయి. అంతే కాకుండా వీరిద్దరూ జోడీగా కూడా కనిపించనున్నట్టు సమాచారం. మరి కీర్తి సురేశ్, సుహాస్ కొత్త కాంబినేషన్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.