Rs 500 Notes : దేశంలో 88 వేల కోట్ల రూపాయలకుపైగా విలువైన కొత్త 500 నోట్లు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. 2015 ఏప్రిల్-2016 డిసెంబర్ మధ్య కాలంలో దేశంలోని 3 మింట్లలో 9 వేల మిలియన్లకు పైగా కొత్త 500 నోట్లు ముద్రిస్తే వాటిలో ఆర్బీఐకి చేరింది 7 వేల 260 మిలియన్ల 500 నోట్లే. మిగతా 1760 మిలియన్ల 500 నోట్లు ఏమయ్యాయో ఎవరికీ తెలీదు. ఆర్బీఐ కూడా ఆ లెక్క తేల్చలేదు. ఆర్బీఐ అధికారులు కూడా నోట్ల అదృశ్యంపై నోరెత్తడం లేదు.
నోట్ల ముద్రణకు సంబంధించిన వివరాలను మనోరంజన్ రాయ్ అనే కార్యకర్త ఆర్టీఐ ద్వారా సేకరించడంతో నోట్లు అదృశ్యమైన సంగతి బయటపడింది. ఈ నోట్ల లెక్క తేల్చాలని ఆయన సీఈఐబీ, ఈడీలకు కూడా లేఖ రాశారు. నోట్ల అదృశ్యంతో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంపై ఆందోళన కలుగుతోందన్నారు. దేశంలో నాసిక్, దేవాస్, బెంగళూరుల్లోని మింట్లలో ఆర్బీఐ కొత్త నోట్లు ముద్రిస్తూ ఉంటుంది.
బెంగళూరులోని మింట్లో 5,195 మిలియన్ల 500 నోట్లు ముద్రించారు. ఇక దేవాస్లోని మింట్లో 1953 మిలియన్ల 500 నోట్లు ముద్రించారు. నాసిక్లోని మింట్లో 375.65 మిలియన్ల 500 నోట్లు ముద్రించారు. అయితే వీటి నుంచి ఆర్బీఐకి అందింది 7,260 మిలియన్ల 500 నోట్లు మాత్రమే.
నోట్ల అదృశ్యంపై పదే పదే ప్రశ్నిస్తే ముద్రించిన నోట్లు, వచ్చిన నోట్ల మధ్య తేడా ఉన్నమాట నిజమేనని ఆర్బీఐ అధికారులు అంగీకరించారు. అదృశ్యమయ్యాయని అనుకుంటున్న నోట్లు ఇంకా రవాణాలో ఉండి ఉండొచ్చని చెబుతున్నారు. అయితే ఏడేళ్ల కిందట ముద్రించిన నోట్లు ఇంకా రవాణాలో ఉండటం ఏంటో ఎవరికీ అంతుబట్టటం లేదు.