Boy Murder : బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పలవారిపాలెంలో టెన్త్ స్టూడెంట్ అమర్నాథ్ సజీవదహనంపై బంధువులు ఆందోళనకు దిగారు. మృతదేహంతో నిరసన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ హత్య కేసు దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని ఆరోపణలు వచ్చాయి. రాజకీయ ప్రమేయం ఉందని విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఉప్పాల అమర్నాథ్ అనే బాలుడికి బాల్యంలోనే తండ్రి చనిపోయాడు. ఆ బాలుడు తల్లి, సోదరి, తాతయ్యతో కలిసి ఉంటున్నాడు. రాజోలు పంచాయతీ పరిధిలోని రెడ్లపాలేనికి చెందిన యువకుడు వెంకటేశ్వరరెడ్డి ప్రేమ పేరుతో తన అక్కను వేధిస్తున్నాడని అమర్నాథ్ నిలదీశాడు. దీంతో నిందితుడు అతడిపై కక్ష పెంచుకున్నాడు. అమర్నాథ్ను హత్య చేయాలని ప్లాన్ చేసి పెట్రోల్ కొన్నాడు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో అమర్నాథ్ ట్యూషన్ కు వెళుతుండగా కొందరు స్నేహితులతో కలిసి వెంటేశ్వరరెడ్డి అడ్డగించాడు. మొక్కజొన్న బస్తాల ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి అతడి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని, మరో నిందితుడు పరారీలో ఉన్నాడని ఎస్పీ వెల్లడించారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సాంకేతికంగా అన్ని ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. హత్య జరిగిన స్థలంలో నిందితుడు ఉపయోగించిన పెట్రోల్ బాటిల్ను స్వాధీనం చేసుకుని వేలిముద్రలను సేకరించామని చెప్పారు. అమర్నాథ్ చనిపోయేముందు ఇచ్చిన మరణ వాంగ్మూలాన్ని వీడియో రూపంలో సేకరించామన్నారు.
ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ చేసి దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మృతుడు, నిందితుడి కుటుంబాలకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని తెలిపారు. ఈ హత్యకు రాజకీయాలు ఆపాదించడం సరికాదన్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యారని .. గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేశామన్నారు. ఈ కేసు దర్యాప్తును పారదర్శకంగా చేస్తున్నామని ఎస్పీ స్పష్టం చేశారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణను బాలుడి బంధువులు, స్థానికులు అడ్డుకున్నారు. తీరిగ్గా పరామర్శించేందుకు వచ్చారా? అంటూ నిలదీశారు. తాను వ్యక్తిగతంగా రూ.లక్ష పరిహారం అందించేందుకు వచ్చానని మోపిదేవి చెప్పారు. అయితే తామే రూ.లక్ష ఇస్తాం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని గ్రామస్థులు హెచ్చరించారు. దీంతో మోపిదేవి బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండానే వెళ్లిపోయారు.