Ready For Another Pandemic : ఇప్పటికే కోవిడ్ మహమ్మారి మిగిల్చిన నష్టాన్ని ప్రపంచం మర్చిపోలేదు. ఒకవేళ అలాంటి వైరస్ మళ్లీ వచ్చినా.. దానిని ఎలా ఎదిరించాలి అనే భయం అందరినీ వెంటాడుతోంది. కోవిడ్ తర్వాత పలు వైరస్ల వల్ల కూడా మానవాళికి ప్రమాదం జరుగుతుంది అని రూమర్స్ వినిపించినా అదేది నిజం కాలేదు. కానీ అలాంటిది కాకపోయినా.. మళ్లీ వైరస్ ప్రభావానికి అందరూ సిద్ధంగా ఉండాలని కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తాజాగా అలాంటి ఒక వైరస్ గురించి వారు బయటపెట్టారు.
యూకే ప్రభుత్వం కొత్త మహమ్మారికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. ఒక భయంకరమైన వైరస్ త్వరలోనే మనుషులకు సోకుతుందని, ఇది సోకిన తర్వాత ఇద్దరిలో ఒకరు కచ్చితంగా మరణిస్తారని అక్కడి శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ వైరస్ పేరు క్రైమీన్ కాంగో హోమోర్హాజిక్ ఫీవర్ (సీసీహెచ్ఎఫ్) అని వారు తెలిపారు. ఇది ఎక్కువగా వాతావరణ మార్పుల వల్ల వస్తుందని బయటపెట్టారు. సీసీహెచ్ఎఫ్ వల్ల 40 శాతం మరణించే అవకాశం ఉంటుందని, అంతే కాకుండా దీనిని నివారించే మార్గం కానీ, దీనికి చికిత్స కానీ లేదన్నారు.
సీసీహెచ్ఎఫ్ వ్యాప్తి చెందడానికి ఎక్కువగా సమయం పట్టదని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. డబ్ల్యూహెచ్ఓ రాసుకున్న భయంకరమైన వ్యాధుల లిస్ట్లో దీనికి కూడా చోటు ఉంది. ఇంతకు ముందు ఇది ఈస్టర్న్ యూరోప్లో కనిపించగా.. ఇప్పుడు ఫ్రాన్స్ వరకు వచ్చేసింది. ఇప్పటివరకు వైద్యులు ఇలాంటి వ్యాధిని ట్రీట్ చేయలేదు కాబట్టి.. వారిపై పూర్తిగా ఆధారపడడం కూడా అంత మంచి విషయం కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. త్వరలోనే సీసీహెచ్ఎఫ్ యూకే వరకు వచ్చేస్తుందని అనుమానాలు వినిపిస్తున్నా.. ఏ వైరస్ ఎప్పుడు ఎలా వ్యాపిస్తుందో తెలియదు కాబట్టి అన్నింటిని సిద్ధంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
టిక్ అనే పురుగుల ద్వారా సీసీహెచ్ఎఫ్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. యూకేలో వేడి వాతావరణం కూడా సీసీహెచ్ఎఫ్తో పాటు పలు ఇతర వ్యాధులకు దారితీస్తుందని వారు తెలిపారు. ఇప్పటికే అక్కడ పలు వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని, కానీ వాటి వల్ల పెద్దగా ప్రమాదం లేదన్నారు. వాతావరణ మార్పులు అనేవి ప్రపంచ దేశాల మధ్య ఎలాంటి తేడా లేకుండా.. అంతటా ఆరోగ్య సమస్యలను సృష్టిస్తున్నాయి. ఇప్పుడు దాని వల్ల యూకే కూడా మహమ్మారికి సిద్ధంగా ఉండమని ప్రకటించడం ఇతర దేశాల ప్రజలను కూడా భయాందోళనకు గురిచేస్తోంది.