Manipur violence news live(Breaking news of today in India): మణిపూర్ లో అల్లర్లు ఆగడంలేదు. జాతుల మధ్య వైరంతో మరోసారి హింస చెలరేగింది. దీంతో రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం రాత్రి క్వక్తా, కాంగ్వై ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. శనివారం వేకువజాము వరకు కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులు గుంపులుగుంపులుగా వీధుల్లోకి వచ్చి విధ్వంసానికి ప్రయత్నించారు. వారిని నిలువరించేందుకు భద్రతా బలగాలు బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించాయి.
మణిపుర్ విశ్వవిద్యాలయం సమీపంలోని తొంగ్జు ప్రాంతంలో ఓ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఇదే తరహాలో దాడికి యత్నించారు. అలాగే ఇంఫాల్ సమీపంలోని ఇరింగ్బామ్ పోలీస్ స్టేషన్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. స్టేషన్ నుంచి ఆయుధాలను లూటీ చేసేందుకు విఫలయత్నం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి ఇంటి వద్ద, బీజేపీ కార్యాలయం వద్ద ఆందోళనకారులు విధ్వంసం సృష్టించేందుకు చేసిన ప్రయత్నాలను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఆర్మీ, అస్సాం రైఫిల్స్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, రాష్ట్ర పోలీసు యంత్రాంగం బందోబస్తు నిర్వహిస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితులపై ఆర్మీ విశ్రాంత అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మణిపూర్ను ఎవరూ రాష్ట్రంగా గుర్తించడం లేదని విశ్రాంత అధికారి లెఫ్టినెంట్ జనరల్ ఎల్ నిషికాంత సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. సిరియా ,లిబియా, లెబనాన్, నైజీరియా లాంటి పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.
రిటైర్డ్ ఆర్మీ చీఫ్ వి.పి.మాలిక్ కూడా స్పందించారు. మణిపూర్ లో పరిస్థితులపై అత్యున్నత స్థాయిలో తక్షణ చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు. ఇటీవల ఇంఫాల్లో కేంద్ర మంత్రి ఆర్.కె.రంజన్ సింగ్ ఇంటిపై అల్లరి మూకలు దాడి చేశాయి. ఓ విశ్రాంత గిరిజన ఐఏఎస్ అధికారికి చెందిన గిడ్డంగిని తగుల బెట్టాయి. ఇప్పుడు మళ్లీ హింసాత్మక ఘటనలు జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.