Emraan Hashmi : ఈరోజుల్లో నటన గురించి నిరూపించుకోవాలంటే హీరోగానే నటించాలి అని పరిధులు ఏమీ పెట్టుకోవడానికి ఇష్టపడడం లేదు చాలామంది నటులు. పాత్రకు ప్రాధాన్యత ఉండాలి, అది తమలోని నటుడిని బయటికి తీసుకువచ్చి ప్రేక్షకులకు పరిచయం చేయాలి అని అనుకుంటున్నారు. అందుకే ఒకప్పుడు స్టార్ హీరోలుగా కొనసాగిన వారు కూడా ఇప్పుడు విలన్లుగా చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆ లిస్ట్లోకి మరో బాలీవుడ్ రొమాంటిక్ హీరో చేరాడు.
ఇమ్రాన్ హష్మీ.. ఈయన పేరు చెప్పగానే బాలీవుడ్ ప్రేక్షకులంతా రొమాంటిక్ హీరో అని గుర్తుచేసుకుంటారు. సీరియల్ కిస్సర్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఎన్నో క్లాసిక్ రొమాంటిక్ చిత్రాలలో నటించిన ఇమ్రాన్.. గత కొంతకాలంగా స్క్రీన్పై అంత యాక్టివ్గా కనిపించడం లేదు. కొన్నాళ్ల వరకు అసలు స్క్రీన్పై కనిపించలేదు. దీంతో తన ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. అంతే కాకుండా తను చివరిగా హీరోగా నటించిన చిత్రాలు కూడా హిట్ కాకపోవడంతో విలన్గా వచ్చిన మొదటి అవకాశాన్ని అందున్నాడు.
సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘టైగర్ 3’లో ఇమ్రాన్ హష్మీ విలన్గా చేయడానికి ఒప్పుకున్నాడు అన్న వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతే కాకుండా సల్మాన్కు ధీటుగా యాక్షన్ కూడా కనబరిచాడని టాక్. హిందీలో తను విలన్గా నటించిన సినిమా ఇంకా విడుదల కాకముందే తెలుగులో మొదటిసారి విలన్గా నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు ఇమ్రాన్. సుజీత్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఓజీ’లో విలన్గా ఎంపికయ్యాడు ఈ బాలీవుడ్ రొమాంటిక్ హీరో. ఇప్పటికే ఓజీలో ఇమ్రాన్ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేసి మూవీ టీమ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఆపై ఇమ్రాన్ కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
‘సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘ఓజీ’తో నా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మూవీ స్క్రిప్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందులో నా పాత్ర చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ సార్తో, సుజీత్తో, దానయ్య సార్తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను’ అని తన ఆసక్తిని బయటపెట్టాడు ఇమ్రాన్ హష్మీ. ఇప్పటికే ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, ప్రియాంక మోహన్ లాంటి వారు ఓజీ సినిమాలో భాగమయ్యారు.