BiporJoy cyclone news latest(Telugu breaking news today): గుజరాత్ రాష్ట్రంపై బిపోర్జాయ్ తుపాను పంజా విసురుతోంది. ఈదురుగాలుల దెబ్బకు భారీ సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరడగడంతో దాదాపు వెయ్యికి పైగా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 10 రోజుల పాటు అరేబియా సముద్రంలో కొనసాగిన బిపోర్జాయ్.. గురువారం సాయంత్రం గుజరాత్లోని జఖౌ పోర్టు సమీపంలో తీరం దాటింది. ఈ సమయంలో గంటకు 125 కిలోమీటర్ల నుంచి 140 కిలోమీటర్ల వేగంతో భీకరమైన గాలులు వీచాయి. అనంతరం కొన్ని గంటల తర్వాత బలహీన పడిందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
బిపోర్జాయ్ తుపాను గుజరాత్లో తీవ్ర విధ్వంసం సృష్టించింది. గుజరాత్ వ్యాప్తంగా జరిగిన వివిధ ప్రమాదాల్లో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. భారీ వృక్షాలు వేళ్లతో సహా నేలకు ఒరిగాయి. చాలా వాహనాలు, ఇళ్లు వర్షం, భీకర గాలుల ధాటికి ధ్వంసమయ్యాయి. శుక్రవారం రాత్రి వరకు బిపోర్జాయ్ తుపాను బలహీనపడి.. తీవ్ర అల్పపీడనంగా మారనుందని.. వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
బిపోర్జాయ్ తుపాను ప్రస్తుతం గుజరాత్ నుంచి రాజస్థాన్ వైపు కదులుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ తుపాను ప్రభావంతో రెండు రోజుల పాటు రాజస్థాన్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. భారీ గాలులు, కుంభ వృష్టి ధాటికి తాత్కాలిక ఇళ్లు, భారీ వృక్షాలు కూలిపోవచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
బిపోర్జాయ్ తుపాను విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్కు ఫోన్ చేసి ఆరా తీశారు. తుపాను తీరం దాటిన తర్వాత జరిగిన పరిణామాలపై చర్చించారు. గిర్ అడవుల్లోని క్రూర మృగాలు, సింహాల భద్రత కోసం తీసుకుంటున్న చర్యల గురించి గుజరాత్ సీఎంను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు.
కురుస్తున్న భారీ వర్షాలకు కొన్ని చోట్ల నడుము లోతు నీళ్లు వచ్చి చేరాయి. NDRf, SDRf బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 631 మెడికల్ టీమ్స్ ను రంగంలోకి దింపారు. గుజరాత్ లోని 8 తీరప్రాంత జిల్లాల్లోని హాస్పిటల్స్ లో 4 వేల దాకా క్రిటికల్ కేర్ బెడ్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 1148 మంది గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అందులో 680 మంది గర్భిణులకు సేఫ్ గా డెలివరీ చేశారు డాక్టర్లు.
బిపోర్జాయ్ తుపాను నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. తీరం వెంబడి లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న లక్ష మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం వారంతా ఆ శిబిరాల్లోనే ఉంటున్నారు. ఈ బిపోర్జాయ్ తుపాను కారణంగా పలు రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 99 రైళ్లు ఆలస్యంగా లేదా రద్దు చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లడంపై శనివారం వరకు నిషేధం విధించారు. గుజరాత్ జామ్నగర్ ఎయిర్పోర్టులో కమర్షియల్ ఆపరేషన్స్ను నిలిపివేశారు. శనివారం నుంచి యథావిధిగా విమాన సర్వీసులు నడుస్తాయని అధికారులు తెలిపారు.