Encounter: జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి భద్రతా బలగాలు. LOC సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టు సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీసుల సంయుక్త బృందాలు ఈ తెల్లవారుజామున గాలింపు ప్రారంభించాయి. కూంబింగ్ సందర్బంగా ఎదురుపడిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
అంతకుముందు జూన్ 13న కుప్వారా సరిహద్దులో ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టారు. కశ్మీర్ లోయలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు, తమ ఉనికి చాటుకునేందుకు.. ఉగ్రవాదులు, పాకిస్థాన్ ఐఎస్ఐ కొత్త మార్గాన్ని ఎంచుకున్నాయి. కశ్మీర్ లోయలో ఆయుధాలు, డ్రగ్స్, సమాచారాన్ని చేరవేసేందుకు ISI, ఉగ్రవాదులు మహిళలు, పిల్లలను ఉపయోగిస్తున్నట్లు సైనికాధికారులు గుర్తించారు. ఇది చాలా ప్రమాదకరమైన అంశమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నియంత్రణ రేఖ వెంబడి తిష్ఠవేసిన మూకలు శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాల్లో ఉన్నాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సైనిక బలగాలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న ఆదేశాలు వెలువడిన గంటల వ్యవధిలోనే ఈ ఎన్కౌంటర్ జరిగింది.