Southwest Monsoon latest news(Morning news today telugu): అదిగో వచ్చాయనుకున్న నైరుతి రుతుపవనాలు ఎక్కడా ముందుకు కదలడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పులు వీస్తున్నాయి. విత్తనాలు విత్తుకునేందుకు రైతన్నలు సిద్ధమవుతున్నా చినుకు జాడ లేకపోవడంతో ఆందోళన తప్పడం లేదు.
వాతావరణశాఖ అంచనాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అయితే యూరప్, యూఎస్ మాదిరిగా అంచనాలు వేయడంలో తడబాటు తప్పడం లేదు. నిజానికి ఈ ఏడాది షెడ్యూల్ ప్రకారమే కేరళకు నైరుతి వస్తుందని అంచనా వేసినా నాలుగు రోజులు లేటయ్యాయి. వీటికి తోడు ఇప్పుడు మోకా, బిపర్ జోయ్ తుఫాన్ల ఎఫెక్ట్ తో నైరుతి మరింత మందగించింది. ఈ నెల 11న ఏపీలోకి నైరుతి రుతుపనాలు ప్రవేశించాయి. 13, 14 తేదీల్లో తెలంగాణలోకి రుతుపవనాలు ఎంటర్ అవుతాయని అంచనా వేసినా అదేదీ జరగలేదు. పైగా రుతుపవనాలు రాక మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు.
రివైజ్ చేసిన డేట్ ప్రకారం ఈనెల 19న తెలంగాణలోకి నైరుతి రుతుపనాలు ప్రవేశిస్తాయని తాజాగా అంచనాలు వేస్తున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలకు రెండు తుఫాన్లు సహా ఎల్ నినో ప్రభావం అడ్డుకట్ట వేశాయి. రుతుపవనాల ప్రవేశం నుంచి విస్తరణ వరకు అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. దీంతో ఓవైపు వడగాల్పులు విజృంభిస్తుంటే, మరోవైపు వర్షాలకు బ్రేకులు పడుతున్నాయి. ఏపీలో శ్రీహరికోట, పుట్టపర్తి వరకూ విస్తరించిన నైరుతి రుతుపవనాలు అక్కడ నుంచి ముందుకు కదలడం లేదు.
ఎండలు, వడగాల్పులు తెలంగాణ, ఏపీని షేక్ చేస్తున్నాయి. కొన్ని చోట్ల ఒంటిపూట బడులు పెడుతున్నారంటే ఎండ తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొమురం భీమ్, సూర్యాపేట, ఖమ్మం వంటి జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. అటు ఏలూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, తిరుపతి లాంటి జిల్లాల్లోనూ 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తంగా ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో నిప్పులకొలిమి కంటిన్యూ అవుతోంది.
అటు చినుకు జాడ లేకపోవడంతో రైతుల్లో టెన్షన్ కనిపిస్తోంది. ఎందుకంటే సమయానికి విత్తు భూమిలో పడకపోతే పంటకాలం ఆలస్యమవుతుంది. క్రాప్ సైకిల్ దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. దీంతో కాత, పూత సహా పంట దిగుబడులపై ఎఫెక్ట్ ఉంటుందంటున్నారు.
అడపాదడపా అక్కడక్కడా వర్షాలు కురిసినా రుతుపవనాలు విస్తరించకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది. బిపర్ జాయ్ ఎఫెక్ట్ ముగిశాక ఈనెల 17 తర్వాతే ఏపీలోని ఇతర ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఇందుకు తగ్గట్ల ఈనెల 18 నుంచి 21లోగా దక్షిణ భారతం దానికి ఆనుకుని తూర్పు భారతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఇప్పటికైతే అంచనాలు వేస్తున్నారు. తెలంగాణలో జులై 6 వరకు పొడి వాతావరణమే ఉంటుందని మరికొన్ని ప్రైవేట్ వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి.