Boy burnt latest news(Breaking news in Andhra Pradesh): బాపట్ల జిల్లాలో దారుణ హత్య జరిగింది. అమర్నాథ్ అనే పదో తరగతి విద్యార్ధిపై స్నేహితుడే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. చెరుకుపల్లి మండలం రాజోలులో ఈ దారుణ ఘటన జరిగింది. అమర్నాథ్ ఉదయం ట్యూషన్కు వెళుతుండగా బాలుడి స్నేహితుడు వెంకటేశ్వరరెడ్డి మరికొందరితో కలిసి ఈ దారుణ చర్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అమర్నాథ్ను వెంటనే గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
అమర్నాథ్ స్వస్థలం చెరుకుపల్లి మండలం రాజోలు పంచాయతీ పరిధి ఉప్పలవారిపాలెం. ఆ బాలుడు స్థానిక ఉన్నత పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు. రోజూ ఉదయం రాజోలులో ట్యూషన్కు వెళుతుంటాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం వెళుతుండగా మార్గంమధ్యలో రెడ్లపాలెం వద్ద వెంకటేశ్వరరెడ్డి మరి కొందరితో కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
మంటలు అంటుకోవడంతో బాధితుడు హాహాకారాలు చేశాడు. ఆ అరుపులు విని స్థానికులు వెంటనే మంటలు ఆర్పారు. అతడిని చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. తనపై వెంకటేశ్వర్రెడ్డి మరికొందరుతో కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించాడని పోలీసులకు బాధితుడు వాంగ్మూలం ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై చెరుకుపల్లి ఎస్ఐ కొండారెడ్డి కేసు నమోదు చేశారు. బాలుడి హత్యపై దర్యాప్తు చేపట్టారు.