HaraGopal: ప్రొఫెసర్ హరగోపాల్ పై దేశద్రోహం కేసు నమోదైంది. UAPA, ఆర్మ్స్ యాక్ట్ తో పాటు 10 సెక్షన్ల కింద హరగోపాల్ పై కేసు నమోదైంది. మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్ పేరు ఉందంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. 2022 ఆగస్టు 19న తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో కేసుబుక్ అయింది. పీపుల్స్ డెమొక్రటిక్ మూవ్ మెంట్ అధ్యక్షుడు చంద్రమౌళి.. బెయిల్ పిటిషన్ సందర్భంగా పోలీసులు ఈ కేసును బయటపెట్టారు. హరగోపాల్ పై UAPA కింద కేసు పెట్టడంపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు భగ్గుమంటున్నాయి.
తనపై ఉప చట్టం ప్రకారం కేసు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు ప్రొఫెసర్ హరగోపాల్. ఎవరి దగ్గరో తన పేరు ఉన్నంత మాత్రాన కేసు పెట్టేస్తారా? అని ప్రశ్నించారు. కేసు పెట్టినంత మాత్రాన సరిపోదని.. సరైన ఆధారాలు ఉండాలన్నారు. మావోయిస్టులు తనలాంటి వారిపై ఆధారపడరని.. వాళ్ల ఉద్యమం వేరే అని చెప్పారు.
తాడ్వాయి పీఎస్లో ఏకంగా 152 మందిపై పలురకాల కేసులు పెట్టారని.. కొందరు చనిపోయిన వారిపైనా కేసులు ఉన్నాయని చెప్పారు. ఇది ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకమని.. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తప్పుబట్టారు. ఈ కేసు కోర్టులో నిలవదని.. న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. UAPA చట్టాన్ని ఎత్తివేయాలని.. తమపై నమోదు చేసిన కేసులను తీసేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల వేళ.. దేశద్రోహం తరహా కేసులు బయటకు రావడం శోచనీయమన్నారు. ఇలాంటి చట్టాలకు వ్యతిరేకంగా ప్రజాఉద్యమం రావాలన్నారు ప్రొఫెసర్ హరగోపాల్.