Cyclone: బిపోర్జోయ్ తీరాన్ని తాకేసింది. గుజరాత్ కచ్ తీరంలో బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ప్రభావానికి భారీ వర్షం పడుతోంది. ఆకాశమంతా మేఘాలతో నిండిపోయింది. గంటకు 100 కి.మీ.కు పైగా వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే తీర ప్రాంతంలోని 20 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలెవ్వరూ ఇళ్లు వదలి బయటికి రావద్దని సూచించారు అధికారులు.
అర్థరాత్రికి సైక్లోన్ పూర్తి స్థాయిలో తీరం దాటేసి.. భూభాగంలోకి ప్రవేశించనుంది. తీరం దాటాక తీవ్ర తుపానుగా.. ఆ తర్వాత వాయుగుండంగా బలహీనపడనుంది. ఇప్పటికే సముద్రంలో కెరటాలు భారీగా ఎగిసిపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. బిపోర్జోయ్ దాటికి గుజరాత్లోని అనేక జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.
తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి సుమారు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. స్కూల్స్, టెంపుల్స్, ఆఫీసులను మూసేశారు. 18 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెడీగా ఉన్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ విభాగాలను అలర్ట్ చేశారు. బోట్లు, హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. రైల్వే శాఖ 76 రైళ్లను రద్దు చేసింది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు.
బిపోర్జోయ్ తుపాను ప్రభావంతో గుజరాత్తో పాటు మరో 8 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాలతోపాటు దమణ్ దీవ్, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ వర్షాలు పడే ఛాన్స్ ఉంది.