Manipur: మణిపూర్ మళ్లీ రావణకాష్టంలా మారింది. వివిధ తెగల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం గత కొన్ని రోజులుగా అట్టుడుకుతోంది. రాష్ట్రంలో నెలన్నర రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పట్లో సద్దుమనిగేలా కనిపించడం లేదు. గురువారం మరోసారి హింస చెలరేగింది. కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి.. భద్రతా బలగాలపై దాడులు చేశారు నిరసనకారులు. దీంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు. మరో ప్రాంతంలో పలు ఇళ్లకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. ముందుజాగ్రత్తగా కొందరు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి భద్రతా బలగాలు.
బుధవారం ఇంపాల్ ఈస్ట్, కాంగ్పోప్కి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అగిజంగ్ గ్రామంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. మరో పది మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. అటు, మణిపూర్ లో ఏకైక మహిళా మంత్రి నెమ్చా కిపిజెన్ ఇంటికి ఆందోళన కారులు నిప్పుపెట్టారు. ఆ సమయంలో మంత్రి ఇంట్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలో తీసుకున్న చర్యలేవీ ఫలించినట్టు కనిపించడం లేదు. కేంద్ర వైఫల్యంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మణిపూర్ హింసపై ప్రధాని మోదీ ఇప్పటి వరకూ స్పందించలేదని మండిపడుతున్నాయి.