Visakhapatnam kidnap case(Andhra Pradesh today news): తన కొడుకు, భార్యను కిడ్నాప్ చేసిన రౌడీషీటర్ హేమంత్ను కఠినంగా శిక్షించాలన్నారు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. కిడ్నాప్ అయిన కొద్ది గంటల్లోనే పోలీసులు పట్టుకోవడం అభినందనీయమన్నారు. గతంలో ఎన్నో కేసుల్లో ఉండి జైలుకు వెళ్లి వచ్చిన ఇలాంటి వ్యక్తులు సమాజంలో తిరిగితే మంచికాదన్నారు ఎంవీవీ. రెండు గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కేవలం ఎంపీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటాయనే కారణంగానే.. నిందితుడు విశాఖ ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసినట్లు.. విశాఖ పోలీస్ కమిషనర్ త్రివిక్రమవర్మ తెలిపారు. ఉదయం ఎంపీ నుంచి సమాచారం అందుకున్న వెంటనే.. స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించామని.. వెంటపడి మరీ చాకచక్యంగా పట్టుకున్నామని వివరించారు.
ఈ నెల 13న ఎంపీ కుమారుడిని కిడ్నాప్ చేసి హింసించారని.. తర్వాత అతడి తల్లిని పిలిపించి బెదిరించి డబ్బు, నగదు తీసుకున్నారని సీపీ తెలిపారు. ఆ తర్వాత ఎంపీని పిలిపించి.. దాదాపు 1.7 కోట్ల నగదును తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ కిడ్నాప్ ఉదంతంలో మొత్తం ఏడుగురు నిందితులను గుర్తించామన్న పోలీసులు.. హేమంత్, రాజేశ్ లను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.
మరోవైపు, రౌడీషీటర్ హేమంత్ను ఎన్కౌంటర్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అందుకే, నిందితులను ఇంతవరకూ బయటకు చూపించలేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ విశాఖలో నేరాలు, నేరగాళ్లు పెరిగాయంటూ ప్రతిపక్షాలు పదే పదే ఆరోపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏకంగా అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేసి, హింసించి.. డబ్బులు వసూల్ చేశారంటే మామూలు విషయమా? ఏపీలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హేమంత్ను పోలీసులు ఎన్కౌంటర్ చేయొచ్చంటూ విశాఖలో టాక్ నడుస్తోంది. ఎంపీ సైతం హేమంత్ లాంటి క్రిమినల్ సమాజంలో తిరగడం మంచిది కాదని అనడం.. ఎన్కౌంటర్ చేస్తారనే ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్టు అవుతోంది.