Chiranjeevi : ఒకప్పుడు మల్టీ స్టారర్లు అంటే హీరోలు అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ఇప్పుడు సీనియర్ హీరోలు సైతం మల్టీ స్టారర్ల కోసం యంగ్ హీరోలతో జతకడుతున్నారు. సీనియర్ హీరోల సినిమాల్లో యంగ్ హీరోలు కొత్త ఫ్లేవర్ను యాడ్ చేయడంతో పాటు ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ను క్రియేట్ చేస్తున్నారు. అలాంటి సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. తాజాగా ఒక యంగ్ హీరోకు, హీరోయిన్కు తన చిత్రంలో చిరు ఛాన్స్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి చాలాకాలమే అయ్యింది. దాని తర్వాత పలు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. కానీ అందులో చాలావరకు రీమేక్లే ఉన్నాయి. రీమేక్లలో నటిస్తూనే ఫ్యాన్స్ను తృప్తిపరుస్తున్నారు మెగాస్టార్. ప్రస్తుతం తమిళంలోని ‘వేదాళం’ చిత్రాన్ని ‘భోళా శంకర్’ పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకొని అనుకున్న సమయానికి విడుదలకు కూడా సిద్ధమవుతోంది. ఇంతలోని చిరు తరువాతి చిత్రం మరో రీమేక్ అని తెలుస్తోంది.
మలయాళంలో మోహన్లాల్ నటించిన ‘లూసిఫర్’ చిత్రాన్ని ‘గాడ్ఫాదర్’ పేరుతో రీమేక్ చేసి తన స్టైల్, స్వాగ్తో సినిమాను హిట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు మరో మోహన్లాల్ చిత్రంపై చిరు మనసు పారేసుకున్నారని తెలుస్తోంది. మలయాళంలో మోహన్లాల్, పృథ్విరాజ్ సుకుమారన్.. మల్టీ స్టారర్గా తెరకెక్కిన ‘బ్రో డాడీ’ని రీమేక్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. ఫ్యామిలీ సినిమాలను డైరెక్ట్ చేసి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ కృష్ణ.. ఈ రీమేక్ను డైరెక్ట్ చేయడానికి రంగంలోకి దిగనున్నట్టు సమాచారం.
భోళా శంకర్ షూటింగ్ను వెంటనే పూర్తి చేసుకొని బ్రో డాడీ రీమేక్ షూటింగ్లో పాల్గొనడానికి చిరంజీవి సన్నాహాలు చేస్తున్నారు. అంతే కాకుండా ఈ మూవీని సంక్రాంతి రిలీజ్కు సిద్ధం చేయనున్నారట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో చిరు భార్య పాత్రలో త్రిష కనిపిస్తుండగా.. పృథ్విరాజ్ సుకుమారన్ పాత్రను సిద్ధు జొన్నలగడ్డ చేస్తున్నారట. అంతే కాకుండా సిద్ధుకు జోడిగా తెలుగులో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి, సిద్ధు ఒకే స్క్రీన్పై కనిపిస్తే.. ఎంత క్రేజీగా ఉంటుందో అని ప్రేక్షకులు అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు.