Visakhapatnam news today telugu(AP latest news): విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబసభ్యులు కిడ్నాప్ నకు గురయ్యారు. ఎంపీ భార్య జ్యోతి, కుమారుడు చందు, ఆ కుటుంబానికి సన్నిహితుడు, ఆడిటర్, వైసీపీ నేత గన్నమనేని వెంకటేశ్వరరావును కొందరు వ్యక్తులు అపహరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల నేపథ్యంలోనే ఈ కిడ్నాప్ జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య ఆనందపురంలోని కుమారుడి వద్దకు వెళ్లే సమయంలో ఈ కిడ్నాప్ జరిగిందని తెలుస్తోంది. ఈ సమాచారం తెలిసిన వెంటనే గన్నమనేని వెంకటేశ్వరరావు అక్కడికి వెళ్లారని సమచారం . ఆ సమయంలో ఆయనను కూడా కిడ్నాపర్లు అపహరించారని అంటున్నారు. వారందరినీ ఓ ఇంట్లో నిర్బంధించారని వార్తలు వచ్చాయి.
ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారంపై పోలీసులు స్పందించారు. ఎంపీ కుటుంబసభ్యులు, ఆడిటర్ జీవీ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. కిడ్నాపర్లను అరెస్టు చేశామని ప్రకటించారు. తన ఫ్యామిలీ క్షేమంగా ఉందని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా తెలిపారు. హైదరాబాద్ లో ఉన్న ఆయన విశాఖకు వెళ్లారు.
నలుగురు కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 8 గంటలకు కిడ్నాప్ సమాచారం పోలీసులకు అందినట్టు తెలుస్తోంది. వెంటనే 15 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ప్రధాన కిడ్నాపర్ హేమంతపై గతంలో పలు కేసులు ఉన్నాయని తెలుస్తోంది.