Rohit Sharma captaincy : ఏ టీమ్ అయినా కలిసికట్టుగా ఆడి గెలవాలంటే అందులో కెప్టెన్ పాత్ర చాలా ముఖ్యమైనది. కెప్టెన్ ధృడంగా గెలవగలము అన్న నమ్మకమే టీమ్ సభ్యులను ముందుండి నడిపిస్తుంది. గెలుపు విషయంలో కెప్టెన్ పాత్ర ఎలా ఉంటుందో.. ఓటమి విషయంలో కూడా తన బాధ్యత అంతే ఉంటుంది. అందుకే రోహిత్ శర్మ కెప్టెన్సీపై ఇప్పుడు అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. అందుకే సెలక్టర్లు కూడా ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.
తాజాగా జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. దీంతో టీమ్లోని సభ్యులతో పాటు రోహిత్ శర్మపై కూడా తీవ్ర ఒత్తిడి మొదలయ్యింది. 2021లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఇలాగే ఓటమి పాలయ్యింది. అప్పుడు న్యూజిలాండ్ చేతిలో ఓడిపోతే.. ఇప్పుడు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. కానీ దానికి, దీనికి ఫ్యాన్స్ ఒకేలా రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా సెలక్టర్లు కూడా దీనిపై గట్టిగానే దృష్టిపెట్టారు.
త్వరలోనే రెండు టెస్ట్ మ్యాచ్లు, మూడు ఓడీఐలు, అయిదు టీ20 మ్యాచ్ల కోసం టీమిండియా.. వెస్టిండీస్కు ప్రయాణం కానుంది. ఈ టూర్లో రోహిత్ శర్మనే కెప్టెన్గా టీమ్ను నడిపించనున్నాడు. అంతే కాకుండా 2023 నుండి 2025 వరకు జరగనున్న డబ్ల్యూటీసీ ప్రయాణంలో కూడా తానే కెప్టెన్గా కొనసాగనున్నాడు. కానీ వెస్టిండీస్లో రెండు టెస్టులు పూర్తయిన తర్వాత రోహిత్ కెప్టెన్సీ గురించి సెలక్టర్లు ఒక నిర్ణయం తీసుకోనున్నారని క్రికెట్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఎంతైనా రోహిత్ను కెప్టెన్సీ నుండి తొలగించడం కూడా అంత సులువైన పని కాదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
రోహిత్ కెప్టెన్సీ నుండి తొలగించబడతాడనే వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని బీసీసీఐ ఉద్యోగి బయటపెట్టారు. కానీ పూర్తిగా డబ్ల్యూటీసీకి 2025 వరకు తనే కెప్టెన్గా ఉంటాడా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. రెండు టెస్టులు, రోహిత్ బ్యాటింగ్ ఫార్మ్ చూసిన తర్వాత తన కెప్టెన్సీ గురించి నిర్ణయించుకోవాలని బీసీసీఐ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. వెస్టిండీస్లో టెస్టులు ముగిసిన తర్వాత సౌత్ ఆఫ్రికా టూర్కు వెళ్లేవరకు మధ్యలో టీమిండియాకు టెస్టులు లేవు. దీంతో రోహిత్ శర్మ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి బీసీసీఐకు కూడా చాలా సమయం ఉంటుంది.