Cyclone Biparjoy: బిపర్ జోయ్ తుఫాన్ దూసుకొస్తోంది. బుధవారం సాయంత్రానికి గుజరాత్లోని జఖౌ పోర్టులతోపాటు పాకిస్తాన్లోని కరాచీ మధ్య తీరం దాటనుంది. బిపర్జోయ్ భారీ విధ్వంసాన్ని సృష్టించే ప్రమాదముందని హెచ్చరించింది ఐఎండి. ఈ ప్రభావం గుజరాత్లోని కచ్, ద్వారక, జామ్నగర్ జిల్లాలపైనే ఎక్కువగా ఉంది. ఇప్పటికే గుజరాత్లో పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. ఈదులుగాలులకు చెట్లు విరిగిపడుతున్నాయ్. తీరా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. బీచ్ల వైపు ఎవరినీ అనుమతించడం లేదు అధికారులు.
కచ్, ద్వారక, జామ్నగర్, పోరుబందర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ. సముద్రంలో ఆరు మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే అలలు సౌరాష్ట్ర, కచ్ తీరాల్లోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతాయని అంటున్నారు.
బిపర్ జాయ్ తుఫాన్ గుజరాత్ తీరంవైపు దూసుకొస్తుండటంతో ఇప్పటికే అధికారులు అప్రమత్తం అయ్యారు. కోస్టల్ ఏరియాల్లోని 30వేల మందిని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెల్టర్స్ కు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ముంపు ప్రాంతాల్లోని ప్రజల తరలింపు కొనసాగుతూనే ఉందని అధికారులు ప్రకటించారు. తీర ప్రాంతానికి 10 కిలో మీటర్ల పరిధిలో నివాసం ఉంటున్న అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
మరోవైపు తుఫాన్ ప్రభావంతో 95 రైళ్లును రద్దు చేశారు. తుఫాన్తో ఈదురుగాలులు కారణంగా.. రైళ్లను రద్దు చేశామంటున్నారు రైల్వే అధికారులు. రైల్వేల భద్రతకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. తభావ్నగర్, రాజ్కోట్, అహ్మదాబాద్, గాంధీధామ్లలో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్లు తెరిచి, అదనపు హెల్ప్లైన్ నంబర్లు కూడా యాక్టివేట్ చేశామన్నారు.