Lakkamma Devi Temple : ప్రపంచంలోనే విభిన్న సంస్కృతులకు , మతాలకు, ఆచారాలకు, పద్దతులు కేరాఫ్ అడ్రస్ ఇండియా. ఎన్నో వింతైన విచిత్రమైన పద్దతులు, నమ్మకాలు ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. ప్రత్యేకించి హిందుఆచారాలు చాలా విశ్వాసమైనవిగా చెబుతుంటారు. దేవుడికి పువ్వులు, పళ్లు నైవేద్యంగా ఇవ్వడం సాధారణంగా జరిగిదే. కాని కర్ణాటకలోని కలబుర్గి ప్రాంతంలో ఓ వింతైన ఆచారం ఉంది. పూలమాల బదులు చెప్పుల దండ కొనుక్కు వెళ్లి మరీ దేవుడికి సమర్పిస్తుంటారు అలంద్ మండలంలోని లక్కమ్మ దేవాలయంలో మాత్రమే ఈ మొక్కను సమర్పించే పద్దతి ఆనవాయితీగా వస్తోంది.ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లో పువ్వులు, కొబ్బరికాయలు అమ్మే దుకాణాలు కనిపించవు.
వినడానికి వింతగా ఉన్నా లక్కమ్మ దేవాలయంలో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తాయి. పువ్వులు అమ్మినట్టు చెప్పుల దండలు అమ్మే షాపులే మన కళ్లకి కనిపిస్తాయి. ఇలా చెప్పుల దండ అమ్మవారికి మొక్కుగా చెల్లించే సంప్రదాయం తరతరాలుగా వస్తోంది. కేవలం జాతర సమయంలోనే ఈ చెప్పుల దండ సంప్రదాయం వస్తోంది..ప్రతి సంవత్సరం దీపావళి ముగిసిన ఐదు రోజులకు అంటే పంచమి రోజున, అలాగే కార్తీక పౌర్ణమి వేళ రెండ్రోజుల పాటు మాత్రమే గుడి దగ్గర ఈ జాతర నిర్వహిస్తారు. ఈ సమయంలోనే కొత్త పాదరక్షలను కట్టే సంప్రదాయం ఉంది. ఈ గుడి ముందు చెప్పులు కట్టడమే ఈ జాతర ప్రత్యేకత.
వాస్తవానికి ఇంతకు ముందు ఈ పద్దతి లేదు. అప్పట్లో జాతర వచ్చినప్పుడు భక్తులు ఎద్దులను బలి ఇచ్చే సంప్రదాయం ఉండేది. ప్రభుత్వం జంతు బలిని నిషేధించడంతో భక్తుల మొక్కులకి అవరోధం ఏర్పడింది. అలా చేయకపోవడం అమ్మవారికి కోపం వచ్చిందట. లక్కమ్మ దేవిని శాంతపరిచేందుకు ఓ ముని తప్ప చేసి జంతు బలికి బదులు చెప్పుల దండను గుడిలో సమర్పించాడట. దీంతో అమ్మవారు శాంతించింది. అప్పటి నుంచే ఈ చెప్పుల దండే జాతరలో సమర్పించే సంప్రదాయం మొదలైంది.
తమ కోరికలు నెరవేరిన భక్తులు గుడి బయట చెట్టుకు చెప్పుల దండను వేలాడదీస్తారు. శాకాహారంతోపాటు మాంసాహారాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా లక్కమ్మ దేవికి చెప్పులు సమర్పించడం వల్ల దుష్టశక్తులన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు పాదాలు, మోకాళ్ల నొప్పి సమస్యలతో బాధపడేవారికి కూడా పూర్తిగా నయమవుతుందని నమ్ముతుంటారు. భక్తితో అమ్మవారిని ఆరాధించే వారికి మేలు చేసే లక్కమ్మ, ఇతరులకి హాని కలిగిస్తే మాత్రం ఉగ్రరూపం చూపిస్తుందని నమ్మకం.