Cyclone: పెను తుపాను బిపర్జోయ్ తీరంవైపు దూసుకొస్తుంది. అత్యంత తీవ్ర తుపానుగా బలపడిన బిపర్జోయ్ ఈ నెల 15న గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో తీరం దాటవచ్చునని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ముందు జాగ్రత్తగా తీర ప్రాంతాల్లోని 21 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. తీర ప్రాంతాలక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. రానున్న 24 గంటల్లో ఈ సంఖ్య మరింత పెరగనుంది. సముద్రంలో అలలు ఉవ్వెత్తును ఎగిస పడుతుండటంతో బీచ్ల్లోకి టూరిస్టులు.. స్థానికులు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే పోర్బందర్, దేవభూమి తీరంలో గాలుల తీవ్రత పెరిగింది. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. చేపల వేటకు వెళ్లే ఆలోచన కూడా చేయద్దని మత్స్యకారులకు సూచించారు అధికారులు. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన బోట్లను కూడా కోస్ట్ గార్డ్ అధికారులు పెట్రోలింగ్ నిర్వహించి వెనక్కి రప్పించారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు వాతావరణశాఖ అధికారులు. అంతేగాకుండా గుజరాత్, దక్షిణ రాజస్థాన్లో రాబోయే మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
ఇక తుపానును ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ తుపాను పరిస్థితిపై సమీక్ష నిర్వహించగా.. మంగళవారం కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా రివ్యూ నిర్వహించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కోనేందుకు సిద్దంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. మరోవైపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఐదురుగు కేంద్ర మంత్రులు పర్యటిస్తున్నారు. NDRF, SDRF బృందాలను ఇప్పటికే మోహరించారు.
తుపాను నేపథ్యంలో నార్త్ వెస్ట్రర్న్ రైల్వే మొత్తం 67 రైళ్లను రద్దు చేసింది. మరో 56 రైళ్ల రాకపోకలను కుదించారు. ముంబై ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలపైనా తుపాను ప్రభావం పడింది. మరోవైపు ఈ నెల 15 వరకు గుజరాత్ లోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.