Comedian Saptagiri political entry : సినిమా, రాజకీయం.. ఈ రెండు రకాలు ఎప్పుడూ పక్కపక్కనే ఉంటాయి. సినిమాల్లో మంచి గుర్తంపు తెచ్చుకున్న తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి ప్రజలకు సేవలు చేయాలనుకున్న వారు ఎందరో ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్లు మాత్రమే కాదు.. స్టార్ హీరోలు, హీరోయిన్లలో కూడా సినిమాలతో పాటు రాజకీయాలను కూడా మ్యానేజ్ చేయాలనుకున్నవారు ఉన్నారు. తాజాగా మరో కమెడియన్ కూడా తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు.
మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమకథా చిత్రమ్’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపును అందుకున్నాడు సప్తగిరి. ఆ ఒక్క సినిమా.. ఇండస్ట్రీలో తనకు ఎంతో క్రేజ్ను తెచ్చిపెట్టింది. దాంతో పాటు వెంటవెంటనే ఆఫర్లు కూడా వచ్చిపడ్డాయి. కొంతకాలం వరకు తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ కమెడియన్గా కొనసాగారు సప్తగిరి. ఆపై హీరోగా కూడా మారారు. కమెడియన్గా గుర్తింపు వచ్చిన తర్వాత హీరోగా మారిన వారి లిస్ట్లో తను కూడా చేరిపోయారు.
సప్తగిరి ఎల్ఎల్బీలో హీరోగా చేసి లీడ్ రోల్లో కూడా అదరగొట్టగలడు అని నిరూపించుకున్నారు సప్తగిరి. గత కొంతకాలంగా సప్తగిరి స్క్రీన్పై కనిపిస్తున్న కాలం తగ్గిపోయింది. ఇక తాజాగా తానే స్వయంగా రాజకీయాల్లోకి వస్తున్నానన్న విషయాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్నానని ప్రకటించారు. చంద్రబాబు, నారా లోకేశ్.. లాంటి టీడీపీ పెద్దలు తనకు సపోర్ట్గా ఉన్నారని తెలిపారు.
టీడీపీ తనకు టికెట్ ఇస్తే.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఏ ప్రాంతం నుండి అయినా పోటీ చేయడానికి తను సిద్దంగా ఉన్నానని సప్తగిరి ప్రకటించారు. టీడీపీ అంటే తనకు ఎంతో ఇష్టమని మనసులోని మాట బయటపెట్టారు. అంతే కాకుండా చంద్రబాబు పాలన అంటే తనకు చాలా ఇష్టమన్నారు. తిరుపతిలో జరిగిన ఒక ప్రెస్ మీట్లో పాల్గొన్న సప్తగిరి ఈ విషయాలను బయటపెట్టారు. ఇక త్వరలోనే తన పొలిటికల్ ఎంట్రీ గురించి పూర్తిగా క్లారిటీ ఇస్తానని చెప్పారు.