Vishaka news today(Latest news in Andhra Pradesh): విశాఖ ఉక్కు విషయంలో 100శాతం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ విషయంలో వెనక్కి తగ్గేదే లే అంటోంది కేంద్రం. ఆస్తుల అమ్మకానికి రంగం సిద్ధం చేసింది. విశాఖ హౌజింగ్ బోర్డ్ కాలనీలో 22.90 ఎకరాల్లో ఉన్న 588 క్వార్టర్లను అమ్మేందుకు అధికారులు నిర్ణయించారు. ఆటోనగర్లోని 2 ఎకరాల పరిధిలో ఉన్న 76 ఇళ్లు, పెదగంట్యాడలో 434.75 చదరపు గజాల్లో ఉన్న 8 ఇళ్లను.. RINL అమ్మకానికి పెట్టింది. నగరం నడిబొడ్డున హెచ్బీ కాలనీలో అమ్మకానికి పెట్టిన ఈ స్థలం విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.1,500 కోట్లకు పైనే ఉంటుంది. ఆటోనగర్లోని 2 ఎకరాలు రూ.100 కోట్ల వరకు ధర పలుకుతోంది.
స్థలాలు అమ్మి.. స్టీల్ ప్లాంట్ నిర్వహించాలన్న ఆలోచనపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఇలా వచ్చే నగదుతో ఇప్పటికిప్పుడు ప్లాంటు అవసరాలు తీరుతాయి కానీ.. ఆ తర్వాత పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఆర్ఐఎన్ఎల్ ప్రకటనతో ఉక్కు ఆస్తులపై కొందరు పావులు కదుపుతున్నారని.. విలువైన ఆస్తులను తక్కువ ధరలకు కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టేలా అడుగులు పడుతున్నాయంటూ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. విశాఖ నగరంలోని విలువైన ఉక్కు ఆస్తులను కేంద్రమే ఆధీనంలో పెట్టుకుని సున్నా వడ్డీకి రుణసాయం చేస్తే ప్లాంటు నిలదొక్కుకునే అవకాశం ఉంటుందనేది నిపుణులు చెబుతున్న మాట.
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు అమ్మకాలపై స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిస్ మండిపడుతున్నారు. వేల కోట్లు విలువైన ఆస్తులు.. కావాలని కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం.. తక్కువ ధరలు నిర్ణయించి అమ్మకానికి పెట్టిందని ఆరోపిస్తున్నారు.