Automobile Prices : కోవిడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఇప్పటికీ ఆ ప్రభావం వల్ల కొన్ని దేశాలు ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. అప్పటినుండి ఇప్పటివరకు కొన్ని రంగాలు వెంటనే అభివృద్ధి చెంది.. నష్టాల నుండి కోలుకున్నా మరికొన్ని రంగాలు మాత్రం ఇంకా బయటపడడానికి కష్టపడుతూనే ఉన్నాయి. అందుకే ప్రభుత్వాలు కూడా ఆ రంగాలు కోలుకోవడానికి పాటుపడడానికి ముందుకొస్తున్నాయి. అలాంటి సంఘటనే బ్రెజిల్లో జరిగింది.
బ్రెజిల్లో ఆటోమొబైల్ ఛార్జీలను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. కోవిడ్ తర్వాత ఆ ఎఫెక్ట్ వల్ల ఆటోమొబైల్ రంగంలో ప్రొడక్ట్స్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇవి ప్రజలపై అదనపు భారంగా మారుతున్నాయి. అందుకే ఆ ధరలను తగ్గించే ప్రయత్నం చేస్తూ.. అటు ప్రజలకు, ఇటు సంస్థలకు నష్టం చేకూరకుండా చూడాలని బ్రెజిల్ భావిస్తోంది. ఇందుకోసమే ముందుగా ఫెడరల్ డీజిల్ ట్యాక్స్ అనే పద్ధతిని అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
బ్రెజిల్ ప్రెసిడెంట్ ల్యూజ్ ఇనాషియో లులా దా సిల్వా ఇప్పటికే ఆటోమొబైల్ కాస్ట్లు తగ్గించడం కోసం ఫెడరల్ డీజిల్ ట్యాక్స్ను ఈ ఏడాదిలో ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి తగిన సన్నాహాలు కూడా చేస్తున్నారు. అంటే ఆటోమొబైల్ కంపెనీలు కాస్ట్ను స్వచ్ఛందంగా తగ్గిస్తే వారికి ఇన్సెన్టివ్స్ రూపంలో ట్యాక్స్ క్రెడిట్స్ దగ్గుతాయని అధికారులు చెప్తున్నారు. ఈ విషయంలో ఆటోమొబైల్ సంస్థలపై ఎలాంటి ఒత్తిడి లేదని, వారు తయారు చేసే మోడల్స్కు స్వచ్ఛందంగా వారే ధరలు తగ్గిస్తే బాగుంటుందని అధికారులు తెలిపారు.
ట్యాక్స్ క్రెడిట్స్ ఇన్సెన్టివ్స్ ద్వారా ప్రభుత్వానికి కనీసం 1.5 బిలియన్ రియాస్ లాభం చేకూరుతుందని వారు అంచనా వేస్తున్నారు. ఇందులో 1 బిలియన్ రియాస్ అనేది బస్సులకు, ట్రక్కులకు డిసౌంట్లు అందించడం కోసం ఖర్చుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. బ్రెజిల్ మాజీ ప్రెసిడెంట్ జెయిర్ బాల్సొనారో కూడా డీజిల్ ట్యాక్స్ కట్ను విధించారు. ఇప్పటి ప్రసిడెంట్ ల్యూజ్ ఇనాషియో లులా దా సిల్వా ఈ డీజిల్ కట్ విషయంలో పలు మార్పులు చేసి ఆటోమొబైల్ కంపెనీల ముందు పెట్టారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో చాలావరకు ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది వేగంగా దూసుకెళ్తుండగా వారితో పోటీ పడాలని బ్రెజిల్ కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.