Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో అనేక ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వివేకా కుమార్తె సునీతా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి హత్య గురించి జగన్కు ముందే తెలుసని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్పై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సునీత స్వయంగా పలు అంశాలను సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ సేకరించిన సాక్ష్యాలతోపాటు అనేక అంశాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు.
అవినాష్ సీబీఐ దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడం లేదని సునీతారెడ్డి సుప్రీంకోర్టుకు తెలిపారు. 3సార్లు నోటీసులిచ్చినా విచారణకు హాజరుకాలేదన్నారు. అరెస్టును తప్పించుకునేందుకు తల్లి ఆరోగ్యాన్ని సాకుగా చూపించారని ఆరోపించారు. సాక్షులను ఎంపీ అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ యంత్రాంగం అవినాష్ రెడ్డికి సహకరిస్తోందన్నారు. కడప ఎంపీకి అధికార పార్టీలోని కీలక వ్యక్తుల మద్దతు ఉందని సునీత ఆరోపించారు.