Cyclone : బిపోర్ జాయ్ తుపాన్ తీవ్రరూపం దాల్చింది. గురువారం మధ్యాహ్నం గుజరాత్లోని కచ్ జిల్లా జఖౌవద్ద తీరాన్ని తాకుతుందని వాతావరణశాఖ ప్రకటించింది. తుపాన్ తీరం దాటే సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. సౌరాష్ట్ర, కచ్లలో భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. సోమవారం తీర ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో వర్షం కురిసింది.
తుపాన్ పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీలో ప్రధాని మోదీ సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో అమిత్ షా తోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుపాన్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర హోంశాఖ తుపాన్ పరిస్థితిని సమీక్షిస్తోందని పీఎంవో తెలిపింది. 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయని పేర్కొంది. మరో 15 స్టాండ్బైలో ఉన్నాయని వెల్లడించింది.
గుజరాత్ తీరంలోని కచ్, పోర్బందర్, దేవభూమి ద్వారక, జాంనగర్, జునాగఢ్, మోర్బి జిల్లాల్లో అధికారులను కేంద్రం అప్రమత్తం చేసింది. కచ్ తీరానికి ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. సముద్ర తీరానికి దగ్గరలో నివశిస్తున్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 7,500 మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.
సముద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చేపల వేటపై నిషేధం విధించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నాయి. సైన్యం, నౌకా, కోస్టుగార్డు దళాలు రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాయి. కచ్ జిల్లాలో అధికారులు 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. ఈ నెల 15న వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చేశారు.
మరోవైపు ముంబైకు వర్షాల ముప్పు పొంచి ఉంది. అక్కడ ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో ముంబై విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలను రద్దు చేశారు. మరికొన్ని సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.