Tamilisai soundararajan latest news(Morning news today telugu): హ.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ గురించే ఈ న్యూస్. కొంత ఆశ్చర్యకరంగానే ఉన్నా.. ప్రధాని అభ్యర్థిగా ఆమె పేరు వినిపించిన మాట నిజమే. కాకపోతే మరో రకంగా.
గవర్నర్ కాకముందు తమిళిసై పక్కా బీజేపీ లీడర్. తమిళనాడు బీజేపీకి అధ్యక్షురాలిగా, పార్టీ జాతీయ కార్యదర్శిగా చేశారు. ఆమె సేవలకు గుర్తింపుగా.. తెలంగాణ గవర్నర్ పదవి వరించింది. అలాంటి తమిళిసై భవిష్యత్తులో బీజేపీ తరఫున ప్రధాని పదవి రేసులో ఉన్నారా? ఆమె పీఎం కావాలని అమిత్ షా కోరుకుంటున్నారా? షాకు తమిళిసై పేరును సీఎం స్టాలినే సూచించారా? అంటే, ఇవన్నీ అవును & కాదు. ఇంతకీ అసలేం జరిగిందంటే…
లేటెస్ట్గా తమిళనాడులో పర్యటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అసలే మాటల గుజరాతీ. తమిళనాడులో పాగా కోసం ఎప్పటినుంచో కన్నేసింది బీజేపీ. ఇంకేం. తమిళులకు గాలం వేసేలా.. ఓ బాణం వదిలారు అమిత్ షా. అదికాస్తా అటూఇటూ తిరిగి.. తమిళిసై వైపు మళ్లింది.
బీజేపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన షా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు తమిళనాడు నుంచి ఎవరికీ ప్రధాని అయ్యే ఛాన్స్ రాకపోవడం విచారకరమని.. ఫ్యూచర్లో ఓ తమిళ వ్యక్తి ప్రధాని కావాలని కోరుకుంటున్నానని..అన్నారు.
అమిత్ షా మాటలను బట్టి.. కార్యకర్తలను ఎంకరేజ్ చేసుందుకు ఓ ‘ఫ్లో’ లో అలా అన్నట్టుగా ఉంది. కానీ, షా వ్యాఖ్యలకు డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ వెరైటీ టర్న్ ఇచ్చారు.
అమిత్ షా సలహాను తాను స్వాగతిస్తున్నానన్నారు. అయితే, ఆయనకు ప్రధాని మోదీపై ఆయనకు అంత కోపమెందుకో? అంటూ సెటైర్ వేశారు. అంటే, తమిళ వ్యక్తి ప్రధాని కావాలని షా కోరుకుంటున్నారంటే.. పీఎంగా మోదీని కాదన్నట్టేగా? అనే అర్థం వచ్చేలా స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. పనిలో పనిగా అమిత్ షాకో సూపర్బ్ ఐడియా కూడా వదిలారు. ఒకవేళ తమిళ వ్యక్తిని ప్రధానిని చేయాలనుకుంటే.. రాష్ట్రం నుంచి తమిళిసై సౌందరరాజన్ (తెలంగాణ గవర్నర్), ఎల్.మురుగన్ (కేంద్రమంత్రి) లాంటి వారు ఉన్నారని.. ప్రధాని అభ్యర్థులుగా వారికి అవకాశం ఇవ్వొచ్చని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
సీఎం స్టాలిన్ సెటైరికల్గా.. ప్రధాని అభ్యర్థిగా తమిళిసై పేరును ప్రతిపాదించినా.. ఆయన వ్యాఖ్యలు అటు ఆ రాష్ట్ర బీజేపీలో, ఇటు తెలంగాణలో ఆసక్తికరంగా మారాయి.