AP Politics: ఏపీలో బీజేపీ స్పీడ్ పెంచింది. మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో దేశవ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్న కమలం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ ను టార్గెట్ చేసింది. ఇన్నాళ్లూ ఈ రెండు పార్టీల మధ్య బంధం సాఫ్ట్ గా కనిపించినా ఇప్పడది రఫ్ గా మారిపోయింది. ఇది ఎన్నికల ఏడాది. స్మూత్ గా డీల్ చేస్తే నడవదనుకున్నారో ఏమోగానీ.. అటు నడ్డా, ఇటు అమిత్ షా ఇద్దరూ వైసీపీ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
నిజానికి మొదటి నుంచి కేంద్రంలో మోదీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలకు సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు ఏపీ సీఎం జగన్. కేంద్రంతో మంచి సత్సంబంధాలను మెయింటేన్ చేస్తున్నారు. రెగ్యులర్ గా ఢిల్లీ వెళ్లడం, మోదీ, అమిత్ షాలతో భేటీలు జరపడం, ఏపీకి రావాల్సిన నిధులపై మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ గ్యాప్ లో కేంద్ర ప్రభుత్వానికి ఏ అవసరం వచ్చినా అటు ఢిల్లీలో ఇటు పార్లమెంట్ లో మద్దతు పలుకుతూ వస్తోంది వైసీపీ. ఇంకేం.. ఈ రెండు పార్టీల మధ్య బహిరంగ పొత్తులు లేకపోయినా లోపాయికారీ డీల్స్ ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ శ్రీకాళహస్తి, విశాఖ బహిరంగ సభలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.
ఏపీ నుంచి 25 ఎంపీ సీట్లకు గాను.. 20 సీట్లలో బీజేపీ, ఎన్డీయే పక్షాలను గెలిపించాలని చెప్పడం ఫైనల్ గా హైలెట్ అయింది. ఎందుకంటే ఇందులో చాలా సమాధానాలకు అమిత్ షా క్లారిటీ ఇచ్చినట్లయింది. భవిష్యత్ పొత్తులపై ఒక ఐడియా ఇచ్చి వెళ్లారు షా. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు భేటీ అయ్యారు. పొత్తులపై స్థూలంగా ఒక అవగాహనకైతే వచ్చారన్న టాక్ నడుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే చాలా సార్లు మాట్లాడారు. ఏపీలో జనసేన, బీజేపీ పొత్తుల భాగస్వామ్యంతోనే ఉన్నాయి. ఇక టీడీపీ అధికారికంగా కలవడమే తరువాయిగా ఉంది.
వైసీపీ ప్రభుత్వం టార్గెట్ గా జేపీ నడ్డా, అమిత్ షా చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో సెగలు రగిలిస్తున్నాయి. వీరి విమర్శలకు వైసీపీ నేతలు రగిలిపోయి ఓ రేంజ్ లో కౌంటర్లు ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ వైసీపీ శిబిరంలో అలా జరగలేదు. నిజానికి సీఎం జగన్ తాజా సభలో కమలం పార్టీని ఎండగడుతారని అనుకున్నా.. అదీ జరగలేదు. కేవలం ఆచితూచి రియాక్ట్ అయ్యారు. ప్రత్యర్థుల మాదిరి మీడియా సహకారం, దత్తపుత్రుడి సహాయసహకారాలు, బీజేపీ అండదండలు తనకు లేవంటూ సింపుల్ గా కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి. వారి అవసరం తనకు లేదని, దేవుని ఆశీస్సులు, ప్రజల దీవెనలను మాత్రమే తాను నమ్ముకున్నానని పల్నాడు జిల్లా క్రోసూరు సభలో చెప్పడం చర్చనీయాంశమైంది. వైసీపీ సర్కార్ అవినీతి మయం అంటూ బీజేపీ అగ్రనేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అయినా జగన్ ఎందుకు సైలెంట్ అయ్యారన్న చర్చ జనంలో జరుగుతోంది.
2024 ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాటి మద్దతు కేంద్రంలో తమకే దక్కేలా బీజేపీ చూసుకుంటోంది. అయితే ఏపీలో సింపుల్ గా జగన్ సర్కార్ పై రాళ్లు వేయడం ద్వారా ఓట్లు సీట్లు వస్తాయనుకోవడం పొరపాటే. ఎందుకంటే మోదీ సర్కర్ ఏపీ ప్రజలకు చెప్పాల్సిన జవాబులు చాలానే ఉన్నాయన్న వాదన కూడా వైసీపీ నేతల నుంచి వినిపిస్తోంది.