Revanth Reddy: రేవంత్రెడ్డి ఆన్ అటాక్. ధరణిపై కేసీఆర్ వర్సెస్ రేవంత్. కొన్నివారాలుగా సాగుతోంది యుద్ధం. బంగాళాఖాతంలో కలిపేస్తామని ఈయన.. కాంగ్రెస్నే బంగాళాఖాతంలో కలిపేయాలని ఆయన. ధరణిపై ఎవరూ తగ్గట్లే. లేటెస్ట్గా పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి డాక్యుమెంట్లతో మీడియా ముందుకు వచ్చారు. ధరణి బాగోతం ఆధారాలతో సహా బయటపెట్టారు.
రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్. ఈ గ్రామం గురించి ఎవరికీ పెద్దగా తెలీకపోవచ్చు. ఇది ప్రస్తుత కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి సొంతూరు. ఒకప్పుడు ఈ గ్రామస్తులు భూదాన్లో భాగంగా వందల ఎకరాలు దానం చేశారు. అందులో కిషన్రెడ్డి ఇంటిపేరు ఉన్నవాళ్లు సైతం ఉన్నారు. అలాంటి తిమ్మాపూర్ గ్రామంలో.. ధరణి సాయంతో ఏకంగా 146 ఎకరాల భూమిని గోల్మాల్ చేశారని ఆరోపించారు రేవంత్రెడ్డి. సుమారు వెయ్యి నుంచి 15వందల కోట్ల భూదందా జరిగిందని అన్నారు. అందుకు సంబంధించిన పేపర్లను మీడియా ముందు ప్రదర్శించారు. ఇంత పెద్ద ఎత్తున భూములను కొల్లగొడుతుంటే.. కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని.. సంబంధిత అధికారులపై ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు. తిమ్మాపూర్ భూదాన్ భూములపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 23వేల ఎకరాల భూదాన్ భూములున్నాయని.. అవన్నీ అసైన్డ్ భూములేనని.. అవి రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేర్ల మీద రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని రేవంత్ ఆరోపించారు. ధరణి పోర్టల్తో బీఆర్ఎస్ నేతలే ఈ భూములను కొల్లగొడుతున్నారని.. అంతా కేసీఆర్, కేటీఆర్ కనుసన్నల్లో జరుగుతోందని విమర్శించారు.
కేసీఆర్కు ధరణి.. బంగారు గుడ్డుపెట్టే బాతులా మారిందన్నారు రేవంత్. ధరణి సమస్యల పరిష్కారానికి 30శాతం కమిషన్ వసూల్ చేస్తున్నారని.. కలెక్టర్లను కేటీఆర్ కీలు బొమ్మలుగా మార్చేశారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ వచ్చాక ధరణి పోర్టల్ రద్దు చేస్తామని.. అమ్మినవారు, కొన్నవారిపై క్రిమినల్ కేసులు పెడతామని.. కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారు రేవంత్రెడ్డి.